అన్ని రంగాలలో దూసుకుపోతున్న భారత్ 

అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  తెలిపారు. టెక్నాలజీ, డ్రోన్లు, ఆన్ లైన్ ఇతర రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. `చేసి చూపెట్టాలి.. సరైన సమయంలో చేయాలి..’  అనే సంకల్పంతో భారతదేశం మున్ముందుకు వెళుతోందని పేర్కొన్నారు.

ప్రగతిశీల వైఖరి విషయంలో భారత్ తన లక్ష్యాలను విజయవంతంగా సాధిస్తోందని స్పష్టం చేశారు. స్టార్టప్ ఎకో సిస్టంలో భారతదేశం మూడో స్థానంలో నిలవడం గర్వంగా ఉందని తెలిపారు. జర్మనీ పర్యటనకు వచ్చిన ఆయన మ్యూనిచ్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈసందర్భంగా మోదీ … మోదీ నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. చిన్న స్మార్ట్ ఫోన్ ను కూడా ఇతర దేశాల నుంచి భారత్ కు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. భారత్ లో తయారయ్యే మొబైల్స్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని గుర్తు చేశారు.

ఈ రంగంలో పెద్దఎత్తున వ్యాపార అవకాశాలను భారత్ సృష్టించిందని సభలో ప్రకటించారు. డేటా విప్లవంలోనూ భారత్ కొత్త  కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు. దీనివల్ల డేటా తక్కువ ధరలో దొరుకుతోందని వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్, సర్టిఫికెట్ విషయంలో టెక్నాలజీ అభివృద్ధి చేశామని చెబుతూ కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో భారత్ ను ఎంతమంది విమర్శించారని, ఉత్పత్తి ప్రక్రియ వేగాన్ని పుంజుకోవడానికి 15 సంవత్సరాలు పడుతుందని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.

అయితే భారత్ లో తయారైన టీకాలు ఇతర దేశాల ప్రజల ప్రాణాలు కూడా రక్షించాయని ప్రధాని పేర్కొన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను 12 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, 12 నుంచి 15 లక్షల మంది ఆన్ లైన్ లో ట్రైన్ల టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారని వివరించారు.

దేశంలో డ్రోన్ టెక్నాలజీ అద్భుతంగా జరుగుతోందని చెబుతూ అనేక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పంటలపై రసాయనాలు చల్లుతున్నారని తెలిపారు. ప్రకృతి విపత్తులు ఎదురైన సందర్భాల్లో డ్రోన్లను విరివిగా  ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.