శివసేన పంచాయితీలో తలదూర్చం.. అలాగని చూస్తూ ఊరుకోం

శివసేన నేతలు ఉద్ధవ్‌ థాక్రే, ఏక్‌నాథ్‌ షిండే వర్గాల మధ్య పంచాయితీలో తాము జోక్యం చేసుకోమని   కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే   స్పష్టం చేశారు. రాజకీయ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సింది వారేనని తేల్చి చెప్పారు.  అయితే శివసేన ఎమ్మెల్యేలు దాదాగిరి చేస్తే సహించబోమని హెచ్చరించారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నివాసంలో జరిగిన భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే తమకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని పేర్కొన్నారు. శివసేన అంతర్గత విషయాల్లో తలదూర్చకూడదని ఫడ్నవీస్‌ కూడా అభిప్రాయపడినట్టు అథవాలే తెలిపారు.

అయితే, చాలామంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అయినప్పటికీ సభలో మెజారిటీ నిరూపించుకుంటామని మహావికాస్‌ అఘాడి సీనియర్లు శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌, ఉద్ధవ్‌ థాక్రే, సంజయ్‌ రౌత్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని అథవాలే పేర్కొన్నారు. 

సొంత పార్టీ నుంచి 37 మంది, 7 నుంచి 8 మంది స్వతంత్ర ఎమ్మేల్యేలు తన వెంట ఉన్నారని ఏక్‌నాథ్‌ చెప్పడం కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక రెబెల్‌ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వారి కార్యాలయాలపై దాడుల ఘటనలపై అథవాలే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాము కూడా అంతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి హెచ్చరించారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతున్న వేళ బీజేపీ ‘వేచి చూసే ధోరణి’ని అవలంభిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. అయితే, అవకాశం వస్తే వదులుకోం అన్న సంకేతాలను కూడా ఆ పార్టీ నేతలు ఇస్తున్నారు.