19 ఏళ్లపాటు వేదనను అనుభవించిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధను తాను దగ్గరుండి మరీ చూశానని, శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకొన్నట్టుగా మోదీ 19 ఏళ్లపాటు వేదనను అనుభవించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎంగా ఉన్న మోదీ‌పై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు తాజాగా సమర్ధించింది. 
 
దీనిపై తొలిసారి మోదీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ”మోదీ తనపై వచ్చిన ఆరోపణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకొన్నట్టుగా భరిస్తూ వచ్చారు. ఇదంతా నేను దగ్గరుండి మరీ చూశాను. న్యాయస్థానం పరిధిలో కేసు ఉండటంతో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు” అని తెలిపారు.
ఎంతో దృఢ సంకల్పం ఉన్నవాళ్లకు మాత్రమే అలా మౌనంగా ఉండటం సాధ్యమవుతుందని అంటూ మోదీని అమిత్‌షా ప్రశంసించారు. గుజరాత్ అల్లర్లపై మోదీపై కావాలనే కొందరు విమర్శలు చేశారని, ఆ ఆరోపణల నుంచి ఆయన బయటపడటం, ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం శుభపరిణామని అమిత్‌షా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందని గుర్తు చేశారు.
 ఆరోపణలు ఎంత తీవ్రతరమైనవి అయినా మోదీ ఎప్పుడు చట్టాన్ని నమ్ముకున్నారని, రాజ్యాంగబద్దంగా వ్యవహరించారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కొందరు ఇంకా అసంతృప్తిగా ఉండడాన్ని ప్రస్తావిస్తూ అదే విధమైన తీర్పును సెషన్స్ కోర్ట్, హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిందని చెబుతూ ఇంకేమి చేయాలని అమిత్ షా ప్రశ్నించారు. 
ఈ కేసు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసినా ఇప్పుడదంతా తొలగిపోయిందని అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు.  గుజరాత్‌ ప్రభుత్వ పరంగా చూసినప్పుడు కూడా అప్పటి మోదీ ప్రభుత్వం ఎలాంటి జాప్యం చేయలేదని, గుజరాత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన రోజున మధ్యాహ్నానికి మధ్యాహ్నమే ఆర్మీని పిలిపించిందని, ఆర్మీ వచ్చేసరికి కొంత సమయం పట్టిందని అమిత్‌షా గుర్తు చేశారు.
ఆర్మీ సైతం ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేదని, కోర్టు కూడా అభినందించిందని తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని, గిల్ సాహెబ్ (పంజాబ్ మాజీ డీజీపీ, దివంగత కేపీఎస్ గిల్) సైతం తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి తటస్థ, సరైన సమయంలో తీసుకున్న చర్యను చూడలేదని ప్రశంసించారని పేర్కొన్నారు.
 గోద్రా దహనం బాధితులతో ఎలాంటి పరేడ్ జరగలేదని, అదంతా అబద్ధమని షా స్పష్టం చేశారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతదేహాలను అంబులెన్స్‌లలో వారి కుటుంబాలకు చేర్చామని తెలిపారు.
 
ఈ కేసులపై పనిచేస్తున్న ఎన్జీఓలు కేసుల వాయిదాను కోరుకొంటూ వచ్చాయని, మోదీపై అపవాదులు మరింతకాలం కొనసాగేటట్లు చేశాయని చెప్పారు. జాకియాతో కలసి పనిచేస్తున్న ఈ ఎన్జీవోలకు రాజకీయ లబ్ధికోసం రాజకీయ పార్టీలు నిధులు సమకూరుస్తూ వచ్చాయని, మీడియా గ్రూపులు కొన్ని మద్దతు ఇస్తూ వచ్చాయని అమిత్ షా ఆరోపించారు. 
 
గుజరాత్‌లో బిజెపి పాలనకు అల్లర్లు ప్రయోజనకరంగా ఉన్నాయా? అని అడుగగా, “అల్లర్లు బిజెపికి లాభదాయకంగా ఉంటే, మేము మరిన్ని అల్లర్లను ప్రేరేపించి ఉండేవాళ్ళం” అని షా చెప్పారు.  బిజెపికి రాజకీయ ప్రత్యర్థులు, సైద్ధాంతికంగా నడిచే రాజకీయ ప్రేరేపిత జర్నలిస్టులు, కొన్ని ఎన్జీఓలు  గుజరాత్‌లో మోదీ ప్రభుత్వంపై ఆరోపణలను ప్రచారం చేశారని ఆరోపించారు. 

“కాంగ్రెస్ , బీజేపీ హయాంలో ఏదైనా ఓ ఐదేళ్ల పాలనను తీసుకోండి అక్కడ కర్ఫ్యూ ఎన్ని గంటలు అమలులో ఉంది? ఎంత మంది మరణించారు? ఎన్ని అల్లర్లు జరిగాయి? అల్లర్లు జరిగిన వ్యవధి ఏమిటో చూడండి. ఏ ప్రభుత్వం హయాంలో ఎక్కువగా జరిగాయో మీకు తెలుస్తాయి. 2002 గుజరాత్ అల్లర్లకు ప్రధాన కారణం గోద్రా రైలు దహనం” అని హోం మంత్రి స్పష్టం చేశారు.

\