ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ ట్వీట్ పై తీవ్ర అభ్యంతరం

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే తరఫున బరిలోకి దిగిన ద్రౌపది ముర్ముపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పట్ల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. తక్షణమే ఆ ట్వీట్ తొలగించాలని డిమాండ్ చేశారు. చావుకబారు ప్రచారం కోసం వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. 

రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమన్న విషయం మర్చిపోరాదని, మీడియా సైతం ఈ అంశంపై చర్చలు నిర్వహించడం సరికాదని జీవీఎల్ పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించడం దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ఆయన తెలిపారు.

ప్రతిపక్షాల తరఫున యశ్వంత్ సిన్హాను నిలబెట్టినప్పటికీ చాలా పార్టీలు తమ అభ్యర్థికే మద్ధతివ్వనున్నాయని ఆయన వెల్లడించారు. ఎన్డీయే అభ్యర్థికి ఇప్పటికే 55 శాతం ఎలక్టోరల్ కాలేజి మద్ధతు లభిస్తోందని, ఇది 75 శాతానికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన తెలిపారు. 

మరోవైపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్ధతు కోరుతూ ద్రౌపది ముర్ము అన్ని రాష్ట్రాల్లో పర్యటించనున్నారని తెలిపారు. ఇప్పటికే ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలు పార్టీల నేతలకు ఫోన్ చేసి మద్ధతు కోరారని తెలిపారు. జులై 1 నుంచి ప్రచారం మొదలుపెడతారని, జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడతారని జీవీఎల్ నరసింహారావు వివరించారు.

రాష్ట్రపతి పదవిలో తెలుగువారు ఉంటే అందరికీ సంతోషమేనని, కానీ ఆదివాసీ మహిళను ఎంపిక చేయడం పట్ల అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోందని జీవీఎల్ పేర్కొన్నారు. 

రాష్ట్రపతి ఎన్నికలను రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ సమగ్రతను, ఐక్యతను ఎవరూ ప్రశ్నించలేరని హితవు పలికారు. తాము అనుకున్నట్టుగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరగలేదని దేశాన్ని విడగొట్టాలని వ్యాఖ్యానించడం సరికాదని తీవ్రస్వరంతో హెచ్చరించారు. 

ఇలా ఉండగా, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. బిజెపి నాయకులు ఆర్జీవీపై పిఎస్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ద్రౌపది ముర్మ గురించి ఆర్జీవీ చేసిన ట్వీట్ పై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.