తెలంగాణలో బీమా పథకం ఏమైందో?

తెలంగాణ రాష్ట్రంలో బీమా పథకం ఏమైందో చెప్పాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ  విజయశాంతి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతుల సంక్షేమంపై లేదని ఆమె విమర్శించారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం మీద కక్షతో తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నారని ఆమె పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. కేసీఆర్ రాజ‌కీయ‌లు త‌ప్ప.. ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చేది ఒక్క‌టి కూడా చేయ‌డం లేదని, ఆయన అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అన్నదాత‌లు అరిగోస‌లు ప‌డుతూనే ఉన్నరని విజయశాంతి విమర్శించారు.
సీఎం సారుకు జాతీయ రాజ‌కీయ‌ల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదంటూ తాజాగా పునాసల సీజన్‌‌‌‌ షురువైనా పంటల బీమా అమలుపై కేసీఆర్ స‌ర్కార్ ఎటూ తేల్చడం లేదని ఆమె ధ్వజమెత్తారు. ఈ సీజన్లో మే 5 నాటికే విడుదల కావాల్సిన పంటల బీమా నోటిఫికేషన్ ఇప్పటికీ రాలేదని చెబుతూ గ‌త రెండేండ్లుగా ఫసల్ బీమా యోజనను కేసీఆర్ స‌ర్కార్ అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
బెంగాల్ తరహాలో మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా పంటల బీమా పథకం తెస్తమని చెప్తున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదని విజయశాంతి దుయ్యబట్టారు. దీంతో పంటలకు బీమా లేక… అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా మన రైతులు నష్టపోతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
కేంద్రం మీద కక్ష‌తో తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నరని అంటూ రైతులకు భరోసా ఇవ్వడం కోసం పంటల బీమా తప్పనిసరిగా అమలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. గతంలో జాతీయ పంటల బీమా పథకం అమలులో ఉండగా, 2016 నుంచీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా, యూనిఫైడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (యూ‌‌‌‌ఐ‌‌‌‌ఎస్) పథకాలు అమలయ్యాయని తెలిపారు.
రాష్ట్రంలో 2016 నుంచి 2019 వరకు నాలుగేళ్ల పాటు ఫసల్‌‌‌‌ బీమా పథకాన్ని అమలు చేశారని, కానీ ఆ తర్వాత 2020 వానాకాలం నుంచీ పంటల బీమా పథకాలన్నింటినీ పక్కన పెట్టేశారని ఆమె ధ్వజమెత్తారు. అలా ఎందుకు చేశారో ఇంతవ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ చెప్ప‌లేదని విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్ర రైతులు 2020 ఖరీఫ్, రబీ సీజన్లలో భారీ వర్షాలు, వడగండ్లు, ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
“2021లో పలు జిల్లాలో అకాల వర్షాల వల్ల వరి, పత్తి, మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించిన మంత్రులు… పరిహారం అందిస్తమని హామీలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇన్పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం బంద్ పెట్టింది” అంటూ విజయశాంతి విమర్శించారు.
గడిచిన రెండేండ్లలో పంటల బీమాకు బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని ఆమె మండిపడ్డారు. దీని వ‌ల్ల తెలంగాణ రైతులు ఎన్నో విధాలుగా న‌ష్ట‌పోయారని చెబుతూ కేసీఆర్ ప్రధాని మోదీ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు, ముందు ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ను అమ‌లు చేయి అంటూ ఆమె స్పష్టం చేశారు రాజ‌కీయ‌ల‌తో ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్న కేసీఆర్‌కి రైత‌న్న‌లు క‌ర్రు కాల్చి వాత పెట్టాడం ఖాయం  అని విజయశాంతి హెచ్చరించారు.