ఈడీ కార్యాలయానికి రాహుల్ `ఊరేగింపుగా’ బయలుదేరేముందు పార్టీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘెల్తో సహా పార్టీ సీనియర్ నేతలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్ఛార్జ్లు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రాహుల్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఏజెన్సీ కార్యాలయానికి కిలోమీటర్ దూరం ఊరేగింపుగా వెళ్లారు. ఆయనతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు జరిపారు.
అక్రమాలపై విచారణ జరిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విస్మయం వ్యక్తం చేశారు. ఈడీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టిందని, ఇది ముమ్మాటికీ కుట్రే అని ఆమె మండిపడ్డారు. గాంధీ కుటుంభం ఆస్తులను రక్షించేందుకు కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిందని ఆమె విమర్శించారు.
రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న నిరసన, గాంధీ కుటుంబానికి చెందిన రూ 2,000 కోట్ల ఆస్తులను కాపాడే ప్రయత్నమే అని స్పష్టం చేస్తూ ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం కాదని ఇరానీ పేర్కొన్నారు. ఏజీఎల్ కంపెనీని సమాజ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయగా, సమాజానికి సేవ చేయకుండా కేవలం గాంధీ కుటుంబ సేవకే పరిమితమవుతోందని ఆమె ఆరోపించారు.
2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ నాయకుడిని ఓడించిన ఇరనై రాహుల్ గాంధీపై నేరుగా మాటల దాడి జరుపుతూ, “వాయనాడ్ ఎంపీ దేశానికి ‘డాటెక్స్ కంపెనీతో రాహుల్ గాంధీకి ఉన్న లింక్ ఏమిటి? అని వివరించాలి” అని డిమాండ్ చేశారు.
1930లలో అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులను వాటాదారులుగా ఏర్పాటు చేసి, స్వాతంత్య్ర సమరయోధులు నడపాల్సిన సంస్థను నేడు గాంధీ కుటుంబం లాక్కుందని మంత్రి మండిపడ్డారు.
జైలు నుంచి బెయిల్పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఇరానీ ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని ఆమె ధ్వజమెత్తారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అందులో రాహుల్ గాంధీ కూడా ఒకరని ఆమె స్పష్టం చేశారు.
కాగా, ఏ తప్పూ చేయనప్పుడు కాంగ్రెస్ నేతలు, రాహుల్ ఎందుకు భయపడుతున్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రశ్నించారు.
ఎద్దేవా చేసిన టిఎంసి
మరోవంక, రాహుల్కు ఈడీ సమన్లు పంపితే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపై నిరసనలు తెలపడం కపటత్వం తప్ప మరొకటి కాదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ విమర్శించింది. తమ నేతలకు సమన్లు జారీ అయినప్పుడు ఆ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని తన అధికార పత్రిక ‘జాగో బంగ్లా’లో పేర్కొంది. కేంద్ర ఏజెన్సీల నుంచి పిలుపు రాగానే కాంగ్రెస్ నాయకత్వం భయంతో వణికిపోతోందని ఎద్దేవాచేసింది.
దేశవ్యాప్త నిరసనలకు ఆ పార్టీ పిలుపునివ్వడం అవకాశవాద రాజకీయాలు, రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని స్పష్టం చేసింది. టీఎంసీ నేతలకు ఈడీ సమన్లు వచ్చినప్పుడు బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధురి హర్షం వ్యక్తంచేశారని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
More Stories
అల్లు అర్జున్ పర్యటనతో నంద్యాల ఎస్పీపై వేటు
నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
హైదరాబాద్ మెట్రో రైలు త్వరలో అమ్మకానికి?