భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఆయన రాష్ట్ర పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా విజయవాడ, రాజమహేంద్రవరంలలో ఏర్పాటు చేస్తున్న పలు కార్యక్రమాలకు ఆయన హాజరు అవుతారు. సోమావారం విజయవాడలో బీజేపీ శక్తికేంద్రాల ఇన్చార్జీలు, కోర్ కమిటీ నేతలతో జరిగే భేటీలలో నడ్డా పాల్గొంటారు.
మంగళవారం సాయంత్రం రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రకటిస్తారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నడ్డా సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 17 కిలోమీటర్లు కారు ర్యాలీతో సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డుకు చేరుకుంటారు.
అనంతరం విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ గ్రౌండ్లో శక్తికేంద్రాల ఇన్చార్జీల సమావేశానికి జేపీ నడ్డా హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ నుంచి నోవోటెల్ హోటల్కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు వెన్యూ ఫంక్షన్హాల్ లో విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పురప్రముఖులతో సమావేశమవుతారు. దాదాపు 400 మంది వరకు సమావేశంలో పాల్గొంటారు.
రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య బీజేపీ ఏపీ కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్ వ్యూహాలపై జేపీ నడ్డా చర్చిస్తారు. మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుని రాజమహేంద్రవరం వెళతారు. అక్కడ కేంద్ర పభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమవుతారు. సాయంత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్న బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

More Stories
విద్యార్థుల కఠోర శ్రమ, అంకితభావం, నిబద్ధత ఫలితమే డిగ్రీలు
లక్ష్మీ నరసింహ స్వామి కోనేరు నిర్మాణంలో రూ. 6 కోట్ల అవినీతి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి