నలుగురు తెలంగాణ పోలీస్ అధికారులకు జైలు శిక్ష

తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఒకటి ఇచ్చింది. నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. 
జాయింట్ పోలీస్ కమీషనర్ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ లకు జైలు శిక్ష విధించింది .  అంతేకాదు నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పోలీసు అధికారుల మీద గతంలో భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం నిబంధనల మేరకు సీఆర్ పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం మోపబడింది.  అయితే.. అప్పీలు వెళ్లేందుకు నాలుగు వారాల జైలు శిక్ష అమలును  ఆరు వారాల పాటు నిలిపివేసింది తెలంగాణ హైకోర్టు.