
సీఎం కేసీఆర్కి రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. ఎవరూ పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద కేసీఆర్ పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద అపాయింట్మెంట్ కోసం సీఎం కేసీఆర్ వేచి చూడడం తెలంగాణకే సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పట్టించుకోకుండా… పక్క రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు చెక్కులు పంచడం ఎంత వరకు కరెక్ట్ అని విజయశాంతి ప్రశ్నించారు.
2018లో కేంద్రంలో చక్రం తిప్పుతానని వెళ్లిన సీఎం కేసీఆర్ బొక్కబోర్లా పడ్డాడని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వోద్యోగులకు జీతాలు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేని అప్పులకుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్దేనని విజయశాంతి ఎద్దేవా చేశారు. ‘‘చట్టాలను మార్చి అప్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ చర్యలను కాగ్ తప్పు పడుతోంది. ఇష్టారీతిన అన్నింటిపైనా చార్జీలు పెంచి, పేద, సామాన్య, మధ్య తరగతి వారిపై అధిక భారం మోపుతున్నారు” అంటూ ఆమె విమర్శించారు.
ఎన్నో త్యాగాలు, ఆకాంక్షల నడుమ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్ళు గడిచిందని చెబుతూ టీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలు, విషాదాలే తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఆమె మండిపడ్డారు. ప్రజలను అన్ని రకాలుగా కష్టనష్టాలపాలు చేస్తున్న కేసీఆర్ సర్కార్కు తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని విజయశాంతి హెచ్చరించారు.
More Stories
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం
12 నుండి 15 వరకు మినీ మేడారం జాతర
ఎస్సి వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం