త్వరలో జనాభా నియంత్రణ చట్టం

దేశంలో పెరిగిపోతున్న జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం దిశగా కేంద్రం చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.  కేంద్ర  ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ  మంత్రి  ప్రహ్లాద్ సింగ్ పటేల్  రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గడ్‌)లో జనాభా నియంత్రణ చట్టం రాబోతుందని వెల్లడించారు.

గరీబ్‌ కళ్యాణ్‌ సమ్మేళన్‌కు హాజరైన ఆయనకు జనాభా పెరిగిపోతుండడం, కట్టడికి చట్టం మీద ఓ ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. ‘‘ఆందోళన అక్కర్లేదు. జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే రాబోతోంది. బలమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇలాగే ఉంటుంది. అది కచ్చితంగా.. అతి త్వరలోనే వచ్చి తీరుతుంద’’ని స్పష్టం చేశారు.

పాపులేషన్‌ కంట్రోల్‌ బిల్లు 2019లో జులైలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు బీజేపీ నేత రాకేశ్‌ సిన్హా. సిన్హా ప్రతిపాదించిన 2019 బిల్లులో  ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించని దంపతులకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత వంటి జరిమానాలను ప్రవేశపెట్టడం లాంటి అంశాలను ప్రస్తావించింది.

దేశంలో జనాభా నియంత్రణే ధ్యేయంగా ఈ చట్టం రాబోతోంది. మరో దశాబ్ద కాలంలో చైనా జనాభాను అధిగమించి, భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా అవతరించబోతోందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. 

ఈ నేపథ్యంలోనే జనాభా నియంత్రణ బిల్లు రూపకల్పన తెర మీదకు వచ్చింది. బిల్లు ప్రతిపాదనపై 125 మంది ఎంపీలు సంతకం చేశారు. అయితే ఇస్లాం విధానాలకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.