అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్

ప్రముఖ యాత్ర కేంద్రం తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక రైల్వే స్టేషన్ గా ఆధునీకరించడానికి భారత రైల్వలు నడుం కట్టాయి.  అందుకు  సంబంధించిన డిజైన్లు ఇప్ప‌టికే పూర్తి కాగా, ఆయా ప‌నుల‌ను వేర్వేరు కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌జెప్ప‌డం కూడా జ‌రిగిపోయింది.

పనులు కూడా శ‌ర‌వేగంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సోమ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత వ‌ర‌ల్డ్ క్లాస్ తిరుప‌తి రైల్వే స్టేష‌న్ డిజైన్ల ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు. అంతేకాకుండా టెండ‌ర్ల‌న్నీ పూర్త‌య్యాయ‌ని, త్వ‌ర‌లోనే ప‌నులు మొద‌లు కానున్నాయ‌ని తెలిపారు.

తిరుప‌తిలోని రైల్వే స్టేష‌న్ నిత్యం రద్దీగానే ఉంటుంది. దేశ‌, విదేశాల నుంచి వెంక‌న్న ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌తో నిత్యం కిట‌కిట‌లాడుతూ ఉంటుంది. అయితే ఆ ర‌ద్దీకి త‌గ్గ‌ట్టుగా రైల్వే స్టేష‌న్‌లో ఇప్ప‌టిదాకా పెద్దగా అభివృద్ధి చేసిన దాఖ‌లా మాత్రం క‌నిపించ‌దు.

ఓ 20 ఏళ్ల క్రితం తిరుప‌తి రైల్వే స్టేష‌న్ ఎలా ఉండేదో ఇప్పుడు కూడా దాదాపుగా అలాగే ఉంది. అయితే ఇంకొన్నాళ్లు గ‌డిస్తే మాత్రం తిరుప‌తి రైల్వే స్టేష‌న్ గుర్తించ‌లేనంత‌గా మారిపోనుంది.