ఐపీఎల్‌ ఛాంపియన్ గా గుజరాత్‌ టైటాన్స్‌

ఐపిఎల్ 15వ సీజన్ ఫైనల్లో గుజరాత్ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గు జరాత్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో తొలిసారి ఐపిఎల్ ఆడుతున్న హార్దిక్‌సేన ఐపిఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 

130 పరుగుల లక్ష ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా (5), మాథ్యూ వేడ్ (8) తక్కువ స్కోర్లకే ఔటైనా శుభ్‌మన్ గిల్ (45; 43 బంతుల్లో 3×4 1×6) నాటౌట్, హార్ధిక్ పాండ్య (34; 30 బం తుల్లో 3×4 1×6), డేవిడ్ మిల్లర్ (32; 19 బంతుల్లో 3×4 1×6)నాటౌట్‌లు బ్యాట్ ఝులిపించడంతో మరో 11 బంతులు మిగిలుండగానే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (39; 35 బంతుల్లో 5×4) ఒక్కడే రాణించాడు. యశస్వీ జైసావ్ల్ (22) ఫర్వాలేదనిపించినా ఆ తరువాత క్రీజులోకి దేవదత్ పడిక్కల్ (2), కెప్టెన్ సంజూ శాంసన్ (14), హెట్మేయర్ (11), అశ్విన్ (6), ట్రెంట్ బౌల్ట్ (11), రియాన్ పరాగ్ (15), మెకాయ్ (8) పరుగులు మాత్రమే చేశారు. 

దీంతో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్య 3 వికెట్ల పగొట్టి రాజస్థాన్‌ను కోలుకోని దెబ్బతీయగా సాయికిశోర్ 2, రషీద్‌ఖాన్, యశ్ దయాళ్, షమి తలో వికెట్ పడగొట్టారు.

బట్లర్ ఐపిఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. 17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో బట్లర్ ఐపిఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 

తొలి స్థానంలో కోహ్లి (973 పరుగులు), మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ (848 పరుగులు), కేన్ విలియమ్సన్ (735 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ (733 పరుగులు), మైక్ హస్సీ(733 పరుగులు) ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు.