రష్యా కంపెనీల్లో స్తంభించిన భారత్ కంపెనీల రూ.975 కోట్ల డివిడెండ్లు

రష్యా కంపెనీల్లో స్తంభించిన భారత్ కంపెనీల రూ.975 కోట్ల డివిడెండ్లు
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఆర్ధిక ఆంక్షలతో సతమవుతున్న  రష్యాకు చెందిన కంపెనీల నుంచి భారత్‌లోని ఆయిల్‌ కంపెనీలకు రావలసిన డివిడెండ్లు రూ 975 కోట్ల మేరకు స్తంభించి పోయాయి.
భారత్‌లోని ఆయిల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లకు 125.49 మిలియన్‌ డాలర్ల (రూ.975.03 కోట్లు) డివిడెంట్‌ పొందాల్సి ఉన్నాయి.  రష్యాకు చెందిన వ్యాంకోర్‌నెఫ్ట్ చమురు ప్రాజెక్టులో 23.9 శాతం, టాస్‌ యుర్‌యాక్‌ ఆయిల్‌ ఫీల్డ్‌లో 29.9 శాతం వాటాలు ఉన్నాయి.
భారత్‌, రష్యా కంపెనీలు చేసుకున్న ఒప్పందం ప్రకారం వ్యాంకోర్‌  6 నెలలకోసారి, టాస్‌ యుర్‌యాక్‌ మూడు నెలలకోసారి డివిడెంట్లు చెల్లించాలి. రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా రూ.975 కోట్లు.. రష్యన్‌ బ్యాంకుల్లోనే ఉండిపోయాయి.  అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్‌ నుంచి రష్యన్‌ బ్యాంకులను బహిష్కరించడంతోనే భారతీయ కంపెనీలకు అందాల్సిన డివిడెంట్లు నిలిచిపోయాయి. ఆయిల్‌ ఇండియా ఫైనాన్స్‌ హెడ్‌ హరీష్‌ మాధవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమకు రావాల్సిన డివిడెంట్‌ రష్యన్‌ బ్యాంకుల్లోనే ఉండిపోయిందని ఆయిల్ ఇండియా ఫైనాన్స్ హెడ్ హరీష్ మాధవ్ తెలిపారు. స్విఫ్ట్‌ క్లియరెన్స్‌ లేకపోవడంతో.. డివిడెంట్‌ అందుకోలేకపోతున్నామని తెలిపారు.  దీనికితోడు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 24న మాస్కో నుంచి ఉక్రెయిన్‌కు సాయుధ బలగాలు తరలివెళ్లడంతో  యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో పాటు అమెరికా వంటి అగ్ర దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి.
క్రూడాయిల్‌ ధరలు భారీగాపెరగడంతో.. మార్చి 31,2022 నాటికి ఆయిల్‌ ఇండియా కంపెనీ నికర లాభం.. 92.32 శాతం పెరిగి.. 16.30 బిలియన్‌ రూపాయల (210.20 మిలియన్‌ డాలర్లు)కు చేరుకున్నాయి.  రష్యా నుంచి కంపెనీల నిష్క్రమణను కేంద్రం సమీక్షిస్తున్నదని, భారతీయ కంపెనీల కన్సార్టియం ఆ ఆస్తుల్లో వాటాలను కొనుగోలు చేయవచ్చు అని ఆయిల్‌ ఇండియా చైర్మన్‌ ఎస్‌సీ మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో తమ నుంచి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు.