నూతన విద్యావిధానంపై రాజకీయ విమర్శలు వద్దు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై రాజకీయపరమైన విమర్శలు చేయడం తగదని తమిళనాడు  గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి హితవు చెప్పారు. తిరువారూరు సెంట్రల్‌ యూనివర్సిటీలో నూతన విద్యావిధానంపై జరిగిన 36 సెంట్రల్‌ యూనివర్సిటీలకు చెందిన వీసీల సదస్సును ఆయన ప్రారంభించారు. 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విద్యావిధానంలో పలు మార్పులు చేస్తోందని, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడానికే ఈ విధానాన్ని ప్రవేశపెడుతోందని ఆయన పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో ఏవైనా నచ్చని అంశాలుంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కూడా ఉందని ఆయన  తెలిపారు. 

నాణ్యతతో కూడిన విద్యనందించేందుకే  కేంద్రం నూతన విద్యావిధానాన్ని అమలు చేయనుందని రవి స్పష్టం చేశారు. నూతన విద్యావిధానం అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాలికను ఈ సదస్సులో రూపొందించాలని ఆయన సూచించారు. ఈ విధానం వెనుక ఉన్న స్ఫూర్తిని అర్ధం చేసుకోవడం ముఖ్యమని చెబుతూ, దానిని అర్ధం చేసుకోలేని పక్షంలో రూపొందించే విధానాలు ప్రయోజనం చేకుర్చవని స్పష్టం చేశారు. 

సాధారణంగా అధికారులకు అర్థంకాని దూరదృష్టితో రాజకీయ స్థాయిలో ఈ  విధానాన్ని రూపొందించారని చెబుతూ ఈ విధానం వెనుక ఉన్న అర్ధాన్ని అర్ధం చేసుకోవడంలో విఫలం అవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. సమస్యల పట్ల మనం చూసే దృష్టిలో మౌలికమైన మార్పులు తీసుకు రాగాల దూరదృష్టిగల నరేంద్ర మోదీ నాయకత్వం లభించిందని కొనియాడారు. 

ఈ సదస్సులో కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాష్‌ సార్కర్‌, శిక్షా సేన్‌స్ర్కిట్‌ ఉద్దన్‌ న్యాస్‌ జాతీయ కార్యదర్శి అతుల్‌ కొథారి, కేంద్ర పరిశోధన శాఖ సంచాలకులు ఆశీర్వాదం ఆచ్చారి, తిరువారూరు సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ కృష్ణన్‌, రిజిస్ట్రార్‌ సులోచనా శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సమావేశం అనంతరం గవర్నర్‌ తిరువారూరు త్యాగరాజస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్ద గవర్నర్‌కు ప్రధానార్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన స్వామివారిని దర్శనం చేసుకున్నారు.