గుజరాత్ సిగ్గుపడేలా ఏ తప్పు చేయలేదు

గుజరాత్‌ సిగ్గుపడేలా తాను ఏ తప్పూ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తన ఎనిమిదేళ్ల పాలన కాలంలో దేశాభివృద్ధికి నూతన ప్రేరణను ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. . మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కలలుగన్న భారత దేశాన్ని నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్ళలో నిజాయితీగా కృషి చేశామని చెప్పారు. 

గుజరాత్‌లో రాజ్‌కోట్‌లోని అట్కోట్‌లో శ్రీ కేడీ పర్వాడియా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మోదీ శనివారం జాతికి అంకితం చేస్తూ  నేడు గుజరాత్ గడ్డపైకి వచ్చానని, గుజరాతీలందరికీ తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. మాతృభూమికి సేవ చేయడంలో ఏ అవకాశాన్నీ తాను వదిలిపెట్టలేదని చెప్పారు. 

‘‘నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ సర్కారు ఫైళ్లకు ఆమోదం తెలిపేది కాదు. గుజరాత్ కోసం ప్రాజెక్టులకు వారు ఆమోదం తెలియజేయలేదు. గుజరాత్ ఫైల్స్ ను బ్లాక్ చేసి నన్ను ద్వేషించారు’’ అని గత అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు.

సమాజం కోసం ఏ విధంగా జీవించాలో గుజరాతీలు తనకు నేర్చారని చెబుతూ  గుజరాతీలు నేర్పిన విద్య, విలువల వల్ల తాను జన్మభూమికి సేవ చేసే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదని స్పష్టం చేశారు. పేదలు, దళితులు, బాధితులు, గిరిజనులు, మహిళలు సాధికారులను చేసే భారత దేశం కావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారని గుర్తు చేశారు. 

పారిశుద్ధ్యం, ఆరోగ్యం జీవన విధానంగా ఉన్న సమాజం కోసం కలలుగన్నారని, దేశ ఆర్థిక వ్యవస్థకు దేశీయ పరిష్కారాలు ఉండాలన్నారని ప్రధాని వివరించారు. కేంద్రంలో ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ సేవలో ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంటోందని గుర్తు చేశారు.

ఈ ఎనిమిదేళ్ళలో తాము పేదలకు సేవ చేయడం, వారి సంక్షేమం కోసం కృషి చేయడం, సుపరిపాలనను అందించడానికే ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’ అనే మంత్రాన్ని తాము అనుసరిస్తున్నామని చెప్పారు. కరోనా మహమ్మారి గురించి ప్రస్తావిస్తూ, పేదల కోసం ప్రభుత్వం ఉన్నట్లయితే, అది వారికి ఎలా సేవ చేస్తుందని ప్రశ్నిస్తూ, వారిని సాధికారులను చేయడానికి పని చేస్తుందని ప్రధాని తెలిపారు.

నేడు యావత్తు దేశం దీనినే చూస్తోందని పేర్కొన్నారు.  వందేళ్ళలో అతి పెద్ద సంక్షోభం కోవిడ్ వచ్చిన సమయంలో కూడా యావత్తు దేశం దీనిని చూసిందని తెలిపారు. ఈ మహమ్మారి ప్రారంభమైనపుడు పేదలకు ఆహారం, తాగునీరు సమస్యలుగా మారాయని గుర్తు చేస్తూ  దీంతో తాము దేశంలోని ఆహార ధాన్యాల గోదాములను తెరిచామని గుర్తు చేశారు. 

తన హయాంలో జన్ ధన్ యోజన పథకం ప్రజలకు ఉపయోగపడినట్లు ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. రైతులు, కార్మికుల జన్ ధన్ ఖాతాల్లో నేరుగా నగదు డిపాజిట్ చేసినట్టు తెలిపారు. కరోనా, యద్ధ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఎక్కడా రాజీ పడలేదని గుర్తు చేశారు.  పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయడంతోపాటు.. ప్రజలు అందరికీ ఉచిత టీకాలు అందించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల ప్రయత్నాలు తోడైనప్పుడు సేవ చేసే బలం పెరుగుతుందని తెలిపారు.