మెడికల్ టూరిజం హబ్ గా భారత్

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సరసమైన వైద్య సదుపాయాలను అందిస్తోందని, విదేశాల నుంచి, ముఖ్యంగా పొరుగు దేశాల ప్రజలు ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేందుకు మన దేశంలోని ఆసుపత్రులను సందర్శిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. 

‘మెడికల్ టూరిజం జం హబ్‌’గా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని భోపాల్ లో ఆరోగ్య మంథన్ కార్యక్రమం ప్రారంభిస్తూ  చెప్పారు.  “భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన వైద్య సదుపాయాలు ఉన్నాయి.  ఆసుపత్రులలో, ముఖ్యంగా ఢిల్లీలో, స్థానిక రోగుల కంటే పొరుగు దేశాల నుండి వచ్చినవారే ఎక్కువ చికిత్స పొందుతున్నారు” అని తెలిపారు.

ఇటీవల తాను జమైకా, సెయింట్ విన్సెంట్‌లను సందర్శించినప్పుడు, ఎనిమిది కార్యక్రమాలలో పాల్గొన్నానని, ఆ దేశాల నాయకులు తమకు అవసరమైన సమయంలో కరోనా  చికిత్సకుగాను  వ్యాక్సిన్‌లను అందించినందుకు భారతదేశాన్ని ప్రశంసించారని గుర్తు చేశారు. 

“ప్రధాని నరేంద్ర మోదీ  జమైకా, సెయింట్ విన్సెంట్‌లకు  50,000 చొప్పున  కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్‌లను ఉచితంగా పంపారు. రెండు దేశాల అగ్ర నాయకులు భారతదేశాన్ని,  దాని మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు” అని వివరించారు.