ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలతో భేటీ కార్యక్రమం లేకపోయినప్పటికీ, స్థానిక నాయకుల విజ్ఞప్తుల మేరకు చివరి క్షణంలో తన కార్యక్రమాలో మారు చేసుకొని, తమను ఉద్దేశించి ప్రసంగించడంతో తెలంగాణలోని బిజెపి వర్గాలలో జోష్ కనిపిస్తున్నది.
ముఖ్యంగా కేసీఆర్ కుటుంభం పాలనను ఎండగట్టడం, తెలంగాణాలో రాబోయెడిది బిజెపి ప్రభుత్వమే అనే భరోసా కల్పించడంతో వారిలో నూతన ఉత్సాహం కనిపిస్తున్నది. ప్రధాని చివరి నిమిషంలో తన షెడ్యూల్ను మార్చుకోవడం, నిర్ణీత సమయం కంటే ముందుగానే హైదరాబాద్కు చేరుకుని పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపేలా ప్రసంగించడం పట్ల బీజేపీ రాష్ట్ర నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం శ్రేణులను సమాయాత్తం చేయడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు ప్రధాని పర్యటనలో పార్టీ శ్రేణులతో భేటీ లేకపోయినప్పటికీ ఆఖరి నిమిషంలో షెడ్యూల్ మార్చేలా ప్రధాని కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన రాష్ట్ర నేతలు చివరకు అనుకున్నది సాధించారు.
బుధవారం రాత్రి పీఎంవో కార్యాలయం వెలువరించిన బులెటిన్ ప్రకారం మోదీ పర్యటన షెడ్యూల్లో బీజేపీ శ్రేణులతో సభ అంశం అసలే లేదు. అయితే, ప్రధాని పీఎంవో కార్యాలయం ప్రకటించిన షెడ్యూల్ టైం కంటే ముందుగానే ప్రధాని హైదరాబాద్లో అడుగుపెట్టారు.
పీఎంవో కార్యాలయం పేర్కొన్న ప్రకారం ప్రధాన మంత్రి మధ్యాహ్నం గం. 1.25లకు చేరుకోవాల్సి ఉంది. కానీ మోదీ గం. 12.50లకే హైదరాబాద్కు వచ్చారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదికపై నుంచి దాదాపు అరగంట పాటు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు.
ప్రధాని తన ప్రసంగంలో అధికార టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను ఉద్దేశించి కఠువైన వ్యాఖ్యలు చేస్తూ శ్రేణుల్లో జోష్ పెంచారు. గురువారం ఉదయం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్ళేందుకు ఉదయం ఎయిర్పోర్టుకు రానున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు తండోపతండాలుగా ఎయిర్పోర్టుకు రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఆందోళన పోలీసులలో స్పష్టంగా కనిపించింది.
ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే ఆయనకు స్వాగతం చెప్పాల్సిన సీఎం బెంగళూరుకు వెళ్ళడంపై బీజేపీ శ్రేణులు నిరసన తెలిపే అవకాశాలున్నాయన్న పుకార్లు రావడంతో ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలలో బారికేడ్లను పెట్టి కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
మరో పక్క ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు నిరసన తెలిపేందుకు టీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తున్నారన్న సమాచారంతో మరింత అప్రమత్తమై ఎప్పుడు ఏం జరుగుంది, ఏ క్షణంలో ఏ వైపు నుంచి నిరసనలు వ్యక్తమవుతాయన్న ఆదుర్ధ పోలీసులలో స్పష్టంగా కనిపించింది. సీఎం బెంగళూరుకు వెళ్ళడం, ప్రధాని పర్యటన సాఫీగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
More Stories
దిశ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టులో పోలీసులకు ఊరట
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు