కుక్కతో వాకింగ్‌ … చెరో మూలకు ఐఏఎస్ దంపతుల బదిలీ

దేశ రాజధాని ఢిల్లీలో క్రీడాకారులు, శిక్షకులకు పేరొందిన త్యాగరాజ్‌ ప్రభుత్వ స్టేడియంలో ‘సారు కుక్కతో కలిసి వాకింగ్‌కు వస్తారు’  అంటూ వారందరిని నిర్ణీత  సమయంకంటే ముందే పంపిస్తున్న సంఘటన వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 
 
గత కొన్ని నెలలుగా  ఢిల్లీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంజీవ్‌ ఖిర్వార్‌   తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్తుండడంతో స్టేడియం మొత్తం ఖాళీ చేయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల జంట ఖిర్వార్‌ను లడ్డాఖ్‌కు, ఆయన భార్య అను దుగ్గాను అరుణాచల్‌ ప్రదేశ్‌కు బదిలీ చేసింది.
 
రాత్రి 7.30 గంటల సమయంలో ఖిర్వార్‌ తన భార్య, తన పెంపుడు కుక్కతో అక్కడకు చేరుకొని వాకింగ్‌ చేస్తున్నారు. కుక్కను ట్రాక్‌పై వదిలేస్తున్నారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ తంతుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాత్రి 8.30 గంటల వరకు సాధన చేసేవాళ్లమని.. ఐఏఎస్‌ అధికారి తీరుతో తమకు ఆటంకం కలుగుతోందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడం తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ రాత్రి 10 గంటల వరకు నగరంలోని స్టేడియాలన్నీ క్రీడాకారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. 
 
ఇది అధికార దుర్వినియోగమేనని, ఐఏఎస్‌ అధికారి క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్‌ కిశోర్‌ డిమాండ్‌ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై ఖిర్వార్‌ స్పందిస్తూ.. తనతోపాటు పెంపు డు శునకాన్ని అప్పుడప్పుడు వాకింగ్‌కు తీసుకెళ్లిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే, అది క్రీడాకారులు, శిక్షకులకు ఇబ్బంది కలిగించలేదని చెప్పారు.