పాంగాంగ్ సో లో చైనా వంతెన వార్తలపై భారత్ దృష్టి!

తూర్పు లడఖ్‌ లోని పాంగాంగ్ సో ప్రాంతంలో (చైనా) వంతెనను నిర్మిస్తున్నట్లు వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇది రెండో వంతెన? లేదా ప్రస్తుతం ఉన్న వంతెనను విస్తరిస్తున్నారా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు.

పాంగాంగ్ సో ప్రాంతంలో (చైనా) వంతెనను నిర్మిస్తున్నట్లు వచ్చిన వార్తల గురించి తెలుసునని చెప్పారు. అయితే సైన్యం దృష్టిలో ఈ అంశం గురించి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఈ వార్తలలో చెప్తున్న ప్రాంతం ఆక్రమించుకున్నది అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.

ఈ పరిణామాలను భారత దేశం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. చైనాతో సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు బాగ్చి సమాధానం చెప్తూ, ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.  పాంగాంగ్ సరస్సు వెంబడి రెండో వంతెనను చైనా నిర్మిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ ఆయుధాలను తీసుకెళ్లే వాహనాలు ఈ వంతెనపై ప్రయాణించగలవని ఆ వార్తా కథనాలు చెప్తున్నాయి.

కొన్ని నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ వంతెనను చైనా నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వంతెన గల ప్రాంతం తమదేనని భారత దేశం చెప్పింది. ఈ మొదటి వంతెనకు సమాంతరంగా నిర్మించిన రెండో వంతెన నిర్మాణం  ఏప్రిల్‌లో పూర్తయిందని తాజా కథనాలు పేర్కొన్నాయి.