కాలుష్యాలతో భారత్ లో ఏడాదిలో 23 లక్షల మంది మృతి

అన్ని రకాల కాలుష్యాల కారణంగా భారత్‌లో ఒక్క (2019) ఏడాదిలోనే 23 లక్షల అకాల మరణాలు సంభవించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో 16 లక్షల మంది వాయు కాలుష్యం వల్లే మరణించినట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 2019లో కాలుష్యం కారణంగా 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ మంది చనిపోయినట్టు పేర్కొనుది. ఈ మరణాల వల్ల ఆ ఏడాదిలో ప్రపంచానికి 4.6 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం ‘ది లాన్సెట్‌’ జరుల్‌లో ప్రచురితమైంది.

విశ్వవ్యాప్తంగా ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. వాయు కాలుష్యం వల్లే ప్రపంచంలో ఒక్క ఏడాదే 66 లక్షల మంది బలయ్యారు. నీటి కాలుష్యంతో 13 లక్షలు, సీసం కారణంగా తొమ్మిది లక్షలతో పాటు మరో 8.7లక్షల మంది ఇతర విషపూరిత వాయువుల కారణంగా చనిపోయారు.

భారత్‌లో వాయు కాలుష్యం వల్ల మరణించిన వారిలో అత్యధికంగా 9.8 లక్షల మంది ప్రమాకరమైన పిఎం 2.5 వల్లే అకాల మరణం చెందారు. భారత్‌లో ముఖ్యంగా ఉత్తరాదిన ఈ కాలుష్య ప్రభావం అధికంగా ఉందని తాజా నివేదిక గుర్తు చేసింది. విద్యుత్, రసాయన పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం అక్కడ తీవ్రంగా ఉందని పేర్కొంది. భారత్‌లో ప్రమాదకర పీఎం 2.5 స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల కంటే చాలా అధికంగా ఉన్నాయని అప్రమత్తం చేసింది.

ప్రజారోగ్యంపై కాలుష్యం ప్రభావం అధికంగా ఉందని, తక్కువ, మధ్య ఆదాయ దేశాలపై ఈభారం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన స్విట్జర్లాండ్‌కు చెంది గ్లోబల్‌ అలయన్స్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌ పొల్యూషన్‌ నిపుణులు రిచర్చ్‌ ప్యుల్లర్‌ పేర్కొన్నారు.

ఇది అత్యంత తీవ్రమైన విషయమైనప్పటికీ కాలుష్యాన్ని నివారించడంలో అంతర్జాతీయ స్థాయిలో పట్టించుకోవడం లేదన్నారు. వీటిపై ప్రజల్లో అవగాహన తేవడంలో ఇటీవల పురోగతి సాధించినప్పటికీ, వాటికి అవసరమైన నిధుల కేటాయింపులో పెరుగుదల నామమాత్రంగానే ఉందని తెలిపారు.