టీఆర్‌ఎస్ నుండి రాజ్యసభకు ముగ్గురు వ్యాపారవేత్తలు

టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ముగ్గురు వ్యాపారవేత్తలను  ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో డా.బండి పార్థసారధిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర) పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. 
 
ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని టీఆర్‌ఎస్ ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా మూడు స్థానాలనూ టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే. 
 
కాగా, ఇందులో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ అయింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19తో గడువు ముగుస్తోంది. మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 24న జారీ కానుంది. 
 
రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఉప ఎన్నిక జరిగే స్థానానికి నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. గత ఏడాది ఎమ్యెల్సీగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తోరాజీనామా చేయించడంతో ఖాళీ అయినా సీట్ కు ఈ ఉపఎన్నిక జరుగనున్నది. ఇక డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం ముగియడంతో మరో రెండ్లు సీట్లు ఖాళీ అయ్యాయి.