ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలి

ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థస్వామిజీ సూచించారు.  ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని హిందువులకు సూచించారు. 
 
లౌడ్‌స్పీకర్ల విషయంలో అందరూ నిబంధనలకు కట్టుబడాలని కోరారు. కారణాలు ఏవైనా ఎప్పటికాలమైనా ధర్మ కేంద్రాలు మసీదులుగా మార్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. ఏదైనా ఆలయాన్ని కొనుగోలు చేసి మసీదుగా మార్చి ఉంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
 
 పూజలు చేసే స్థలమైనా విక్రయం జరిగిన తర్వాత మార్పు ఉంటే సమస్య కాదని చెప్పారు. అయితే ఆక్రమణలతో మార్పు జరిగి ఉంటే వాటిని ఖండించాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం సాగుతున్న పరిణామాలను స్వాగతిస్తామని చెబుతూ  కోర్టు తీర్పులను అందరూ పాటించాలని హితవు చెప్పారు. 
 
గతంలో ఎలా జరిగిందో చర్చ అవసరం లేదని ప్రస్తుతం కోర్టు మార్గదర్శకాలను పాటించాలని హితవు పలికారు. పూజామందిరమైతే హిందువులకు, దర్గాలు ఉంటే ముస్లింలకు వదిలేయాలని సూచించారు. తప్పు జరిగి ఉంటే సరిదిద్దాలని, వాటిని ఎవరూ సమర్థించుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఘర్షణలకు అవకాశం లేకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడం సముచితమని పేర్కొన్నారు.