అస్సాంలో అవినీతి రహిత ఉద్యోగ నియామకాలు

ప్రభుత్వోద్యోగ నియామకాల్లో పారదర్శకతను పాటిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. శనివారం ఆయన 22,958 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వీరు 11 ప్రభుత్వ శాఖల్లో నియమితులయ్యారు. 
ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, 2011 నుంచి తాను అవినీతి రహిత, పారదర్శక నియామకాలను ప్రారంభించానని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశానని పేర్కొన్నారు.
అవినీతి లేకుండా, పారదర్శకంగా నియామకాలను చేపట్టడం వల్ల రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ కన్నా దేశానికే పెద్ద పీట వేయాలని తమకు బీజేపీ బోధించిందని తెలిపారు.  ఎన్నికల్లో తన గెలుపు కోసం పగలు, రాత్రి తేడా లేకుండా కృషి చేసినవారు తన నుంచి కొంత ఆశిస్తారని చెప్పారు.
అయితే, తాను వారికి ఏమీ ఇవ్వలేనని చెప్పారు. అవినీతి రహిత నియామకాల కోసం తాను, తన పార్టీ అనేక త్యాగాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇలా చేయాలని తనపై ఎటువంటి ఒత్తిళ్ళు లేవని స్పష్టం చేశారు. అస్సాం భవిష్యత్తు కోసం, తాము రాజకీయంగా నష్టపోతున్నప్పటికీ, 2011లో పారదర్శక నియామకాల ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు.