ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌కు పాక్ లింకులపై సీబీఐ దర్యాప్తు

పాకిస్థాన్ నుంచి అందే సూచనల ఆధారంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తున్న క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేస్తోంది.  ఐపీఎల్   మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసే నెట్‌వర్క్ గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో ఈ దర్యాప్తును ప్రారంభించింది. 
 
ఈ నెట్‌వర్క్‌లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్ నగరాలకు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు ఉన్నారు.  ఐపీఎల్  బెట్టింగ్   లో పందెం కాసే విధంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పని చేస్తోంది.
నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ నేరాలతోపాటు అవినీతి నిరోధక చట్టం ప్రకారం శుక్రవారం రెండు కేసులను సీబీఐ నమోదు చేసింది. ఓ ఎఫ్ఐఆర్  (ప్రథమ సమాచార నివేదిక)లో సీబీఐ పేర్కొన్న వివరాల ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాన్ని ప్రభావితం చేసే క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తుల నెట్‌వర్క్ గురించి  సీబీఐ కి విశ్వసనీయ సమాచారం అందింది.
పాకిస్థాన్ నుంచి అందే సూచనల ఆధారంగా ఈ నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తోంది. పందెం కాసేలా చేయడానికి ప్రజలను ప్రలోభ పెడుతోంది. ఈ బెట్టింగ్ లావాదేవీల కోసం ఈ ముఠా నకిలీ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచింది. బ్యాంకు అధికారులు కూడా ఈ వ్యవహారంలో కుమ్మక్కయ్యారు.
భారత దేశం లోని ప్రజల నుంచి బెట్టింగ్ ద్వారా సంపాదించిన సొమ్ములో కొంత భాగం హవాలా లావాదేవీల ద్వారా విదేశాలకు తరలి వెళ్తోంది. నిందితులు పాకిస్థాన్‌లోని వకాస్ మాలిక్‌తో నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. ప్రాథమిక దర్యాప్తులో వకాస్ ఫోన్ నెంబర్ లభించింది.
ఈ ఎఫ్ఐఆర్‌లో దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసులను నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఈ నెట్‌వర్క్ 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందని తెలిపింది. నిందితుల బ్యాంకు ఖాతా ద్వారా దాదాపు రూ.10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు వివరించింది.
సీబీఐ నమోదు చేసిన రెండో ఎఫ్ఐఆర్‌లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. వీరు 2010 నుంచి  ఐపీఎల్   క్రికెట్  బెట్టింగ్    నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వీరు జరిపిన లావాదేవీల విలువ రూ.1 కోటి మేరకు ఉంటుందని తెలిపింది.