కీవ్‌ నగరంలో 17 నుండి భారత రాయబార కార్యాలయం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రాజధాని కీవ్‌ నగరంలో మూతపడిన భారత రాయబార కార్యాలయం త్వరలోనే పున:ప్రారంభం కాబోతోంది. పోలాండ్ రాజధాని వార్సా నుంచి తాత్కాలిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇండియన్ ఎంబసీ మే 17, నుంచి కీవ్‌లో పున:ప్రారంభం కానుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. 
 
యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడే ఇటివల ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ నగరంతోపాటు కీవ్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు. మరోవైపు అమెరికాతో పాటు పలు దేశాలు కీవ్ తమ రాయబార కార్యాలయాలను పున:ప్రారంభిస్తున్నట్టు ఇదివరకే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఇండియన్ ఎంబసీ కార్యాకాలపాలను ప్రారంభించేందుకు నిర్ణయించింది.
 
 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరమైన నేపథ్యంలో మార్చిలో ఇండియన్ ఎంబసీ కార్యకలాపాలు బంద్ అయ్యాయి. ఉక్రెయిన్ నుంచి అత్యధిక భారతీయులు తరలించిన అనంతరం మార్చి 13న ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని పోలాండ్ రాజధాని వార్సాకు తరలించిన విషయం తెలిసిందే. 

రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మొదటినుంచీ ఆరోపిస్తున్న ఉక్రెయిన్, తొలిసారిగా ఆ అభియోగాల కింద రష్యా సైనికునిపై విచారణకు శుక్రవారం తెర తీసింది. చుపాకివ్‌కా గ్రామంలో 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపిన కేసులో అరెస్టయిన రష్యా జవాను సార్జెంట్‌ వాదిమ్‌ షైషిమారిన్‌(21)ను కీవ్‌లోని కోర్టుకు తరలించి విచారించారు. షైషిమారిన్‌ అంగీకరించాడని అధికారులు చెప్పారు. అతనికి యావజ్జీవ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ముమ్మాటికీ బాలల హక్కుల సంక్షోభమేనని ‘యునిసెఫ్‌’ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒమర్‌ అబ్దీ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, నాటో కూటమిలో చేరొద్దని ఫిన్‌లాండ్‌ను రష్యా హెచ్చరించింది. లేదంటే సైనిక, సాంకేతిక  చర్యలు తప్పవని హెచ్చరించింది.

తూర్పు ఉక్రెయిన్‌లోని సివెర్‌స్కీ డొనెట్స్‌ నదిని దాటుతున్న రష్యా దళాలపై ఉక్రెయిన్‌ సైన్యం విరుచుకుపడినట్లు బ్రిటిష్‌ అధికారులు శుక్రవారం తెలిపారు. పదుల సంఖ్యలో రష్యా సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయని, జవాన్లు హతమయ్యారని వెల్లడించారు. ఆయుధాల కొనుగోలు కోసం ఉక్రెయిన్‌కు అదనంగా 520 మిలియన్‌ డాలర్ల సాయం అందించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. జి–7 దేశాల దౌత్యవేత్తలు జర్మనీలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై చర్చించారు.