హనీట్రాప్‌లో వైమానిక దళ ఉద్యోగి

దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని.. పాకిస్తాన్‌కి లీక్‌ చేశారన్న ఆరోపణలపై భారత వైమానిక దళ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ ఉద్యోగి హనీట్రాప్‌లో చిక్కుకున్నాడని, ఒక ఏజెంట్‌కి సమాచారాన్ని అందించినట్లు క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆరోపించారు. 
 
భారత వైమానిక దళంలో గూఢచర్యం జరుగుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ రికార్డ్‌ ఆఫీస్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న దేవేంద్ర నారాయణ్‌ శర్మ ద్వారా సమాచారం బయటకు వెళ్తున్నట్లు గుర్తించారు. 
 
ఈనెల 6వ తేదీన అతనిని కస్టడీలో తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్‌కి చెందిన ఒక మహిళ ద్వారా దేవేంద్ర హనీట్రాప్‌లో చిక్కుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. సామాజిక మాధ్యమాల ద్వారా దేవేంద్రను ఆమె ట్రాప్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
రక్షణ రంగ కార్యాలయాలు, స్థావరాలు, సిబ్బందికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇచ్చినట్లు భావిస్తున్నారు.ఈ సమాచారం ఇచ్చినందుకు కొంత నగదు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.  మే 6న కస్టడీలోకి తీసుకోగా.. మే 12న (గురువారం) విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ విచారణలో భాగంగా శర్మ నుంచి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్‌ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, దేవేంద్ర శర్మ ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో శర్మను సర్వీస్‌ నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు.