పండిట్ శివ కుమార్ శర్మ మన దేశంలో అత్యంత సుప్రసిద్ధులైన సంప్రదాయ సంగీతకారుల్లో ఒకరు. ఆయన వచ్చే వారం భోపాల్లో ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. ఈలోగానే ఆయనకు గుండెపోటు రావడంతో అందరికీ దూరమయ్యారు. ఆయన వయసు 84 సంవత్సరాలు.
ఆయన కుటుంబ సభ్యులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మంగళవారం ఉదయం ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని చెప్పారు. ఆయనకు నిత్యం డయాలసిస్ జరుగుతూ ఉండేదని, అయినప్పటికీ ఆయన చాలా చురుగ్గా ఉండేవారని చెప్పారు.
వచ్చే వారం ఆయన భోపాల్లో ప్రదర్శన ఇవ్వవలసి ఉందని, ఈ లోగానే ఈ విధంగా తమకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పండిట్ శివ కుమార్ శర్మ 1938లో కశ్మీరులో జన్మించారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. జమ్మూ-కశ్మీరులోని జానపద వాద్య పరికరం సంతూర్ను ఉపయోగించి భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు ఆయనే కావడం విశేషం.
పండిట్ శివ కుమార్ శర్మ సుప్రసిద్ధ వేణు నాద సంగీతకారుడు పండిట్ హరి ప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘సిల్సిలా’, ‘లమ్హే’ , ‘చాందిని’ వంటి సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. పండిట్ శివ కుమార్ తనయుడు రాహుల్ శర్మ కూడా సంతూర్ వాద్యకారుడే. ఆయన మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంతాపం ప్రకటించారు. అధికార లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరుపనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
More Stories
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు