అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం , అతడి హవాలా ముఠా వ్యవహారాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ ముమ్మరం చేసింది. ముంబై లోని అతడి అనుచరుల ఇళ్లపై ఒక్కసారిగా సోమవారం దాడులు చేపట్టింది.
దావూద్ కోసం ముంబై కేంద్రంగా హవాలా వ్యాపారులు పనిచేస్తున్నట్టు ఎన్ఐఎ గుర్తించింది. దావుద్ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేతలో భాగంగా ఎన్ఐఏ నగరంలోని 20 ప్రాంతాల్లో పరారీలో ఉన్న అతని సహచరుల ఆఫీసులపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడుల జాబితాలో.. షార్ప్ షూటర్లు, డ్రగ్స్ దందా చేసేవాళ్లు, హవాలా ఆపరేటర్లు, దావూద్ ఇబ్రహీంకు చెందిన రియల్ ఎస్టేట్ మేనేజర్లు, క్రిమినల్ సిండికేట్లోని ఇతర కీలక వ్యక్తుల ఉన్నట్లు తెలుస్తోంది.
బాంద్రా, బోరివలి, గోరెగావ్, పరేల్, శాంటాక్రూజ్ తదితర ప్రాంతాల్లో దావూద్ కంపెనీకి చెందిన హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగ్లన్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఐఎ తనిఖీలు జరిపింది. దావూద్కు చెందిన డీకంపెనీ హవాలా ఆపరేటర్లు, కీలక వ్యక్తులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఐఎ కేసు నమోదు చేసింది.
ఉగ్రకార్యకలాపాల ద్వారా భారత్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఈ దాడుల నిమిత్తం దావూద్ ఓ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ప్రముఖ రాజకీయ నేతల, వ్యాపార వేత్తలను వీరు లక్షంగా చేసుకున్నట్టు ఆ మధ్య నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యం లోనే అప్రమత్తమైన ఎన్ఐఎ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్కు డీకంపెనీతో ఉన్న సంబంధాలు, దావూద్ కుటుంబ సభ్యులతో మాలిక్కు పరిచయాలున్నాయన్న ఆరోపణల పైనా ఎన్ఐఎ విచారణ జరుపుతోంది. ఈ దాడుల్లో భాగంగా దావూద్ అనుచరుడు సలీమ్ ఫ్రూట్ను ఎన్ఐఎ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
More Stories
రుతుపవనాల తర్వాతే ఆహార ధరలు తగ్గుముఖం
ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా ఉపసంహరణ
నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయకుండా ఎలా?