ఆర్బీఐ తాజాగా వడ్డీ రేట్లను పెంచడం ఆశ్చర్యం కలిగించలేదని, అయితే పెంచిన సమయమే ఆశ్చర్యపరిచిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నిధులను సేకరించడానికి ఖర్చు పెరిగినప్పటికీ, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం చేసే పెట్టుబడులపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆమె స్పష్టం చేశారు.
ఆర్బీఐ 2018, ఆగస్ట్ తర్వాత మొదటి సారిగా ఈ నెల 4 న రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (4.40 శాతానికి) పెంచింది. రిటైల్ ద్రవ్యోల్భణం ఈ ఏడాది మార్చిలో 6.9 శాతానికి పెరగగా, ఏప్రిల్లో 7.7 శాతంగా ఉంటుందని అంచనా.
‘ఆర్బీఐ రేట్లను పెంచడం ఆశ్చర్యం కలిగించలేదు. కానీ అకస్మాత్తుగా పెంచడం ఆశ్చర్యం కలిగించింది. రేట్ల పెంపు కచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. రెండు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాలకు మధ్య రేట్ల పెంపు జరగడం ఆశ్చర్యం కలిగించింది’ అని సీతారామన్ పేర్కొన్నారు.
ఓ ఆవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న ఆమె ఆర్బీఐ రేట్ల పెంపుపై మొదటిసారిగా మాట్లాడారు. రేట్ల పెంపు ఉంటుందనే సంకేతాలను కిందటి ఎంపీసీ సమావేశంలోనే ఆర్బీఐ ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ‘అన్ని దేశాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా రేట్లు పెంచింది. అమెరికా కూడా ఆ రోజు రాత్రే రేట్లు పెంచింది’ అని ఆమె తెలిపారు.
సెంట్రల్ బ్యాంకులన్నీ ఒకేలా ఆలోచిస్తున్నాయని ఆమె చెబుతూ కరోనా నుంచి రికవరీ అవ్వడంపై అన్ని దేశాలు పనిచేస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. సంక్షోభం నుంచి రికవరీ అవుతున్నామని, అయితే ద్రవ్యోల్భణం మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉందని ఆమె చెప్పారు
ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం చేసే ఖర్చులపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపించదని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలపై ఆమె మాట్లాడారు.
ఈ ఆంక్షల వలన రష్యా ఆయిల్ను కొంటున్న దేశాలు మిడిల్ ఈస్ట్లోని క్రూడాయిల్ వైపు చూస్తున్నాయని, దీంతో ఈ క్రూడ్ ధరలు పెరుగుతున్నాయని ఆమె చెప్పారు. చౌకగా ఆయిల్ ఎక్కడ దొరికినా భారత్ కొనుగోలు చేస్తుందని మరోసారి ఆమె స్పష్టం చేశారు.
More Stories
ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు
ఈడీ విచారణకు మూడోసారీ మొయిత్రా డుమ్మా
కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్ కేసు