`తాజ్’ గదులను తెరవాలని హైకోర్టులో పిటిషన్

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను తెరవాలని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ)ని ఆదేశించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. 
 
బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.  తాజ్ మహల్ విషయంలో చాలా కాలం నుంచి వివాదం ఉందని డాక్టర్ రజనీశ్ చెప్పారు. ఈ కట్టడంలోని 20 గదులకు తాళాలు వేశారని, వీటిలోకి ఎవరికీ ప్రవేశం కల్పించడం లేదని పేర్కొన్నారు.
వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ గదులను తెరవాలని ఎఎస్ఐ ని ఆదేశించాలని తాను హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు.
వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ గదులను తెరచి, వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే, వివాదాలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ విధంగా చేయడం వల్లన ఎటువంటి హాని జరగబోదని స్పష్టం చేశారు.  తాజ్ మహల్ మొదట్లో తేజో మహాలయ అనే హిందూ దేవాలయం అని పలువురు చాలాకాలంగా వాదిస్తున్నారు. ఇది అసలు శివ దేవాలయం అని పేర్కొంటూ ఆరుగురు న్యాయవాదులు 2015లో ఓ కేసు దాఖలు చేశారు. 2017లో బిజెపి నేత వినయ్ కతియార్ కూడా అదే వాదనను వినిపిస్తూ, అక్కడకు వెళ్లి హిందువుల వాదనలను పరిశీలించమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కోరారు. 
 
తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించలేదని, రాజా జయసింహ నిర్మించాడని అంటూ , 2019లో బిజెపి నాయకుడు అనంత్ కుమార్ హెగ్డే వాదించారు. అయితే ఇటువంటి వాదనలను ఎఎస్ఐ తోసిపుచ్చుతూ వస్తున్నది. దానిని మొగల్ రాజు షాజహాన్ యే నిర్మించాడని అంటూ ఫిబ్రవరి, 2018లో నిర్మించాడని అంటూ కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేసింది.