షార్ లో మరో భారీ ప్రాజెక్ట్ కు సన్నాహాలు

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో (షార్‌) మరో భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీనిని వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఏడాదిన్నర కిందటే సిద్ధం కావాల్సి ఉండగా కరోనా విజృంభణతో పనుల్లో జాప్యం జరిగింది. 
 
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడి నుంచి ఏటా 15 పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ప్రణాళికలు రచించింది. ఇందుకుగానూ కొత్త ప్రయోగ వేదిక నిర్మాణం చేపట్టకుండా ఉన్న దాంట్లోనే మరిన్ని వసతులు ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చేలా రూపకల్పన చేశారు. 
 
ఈ నేపథ్యంలో మొదటి ప్రయోగ వేదికను పూర్తి స్థాయిలో ఆధునికీకరించాలని 2018లో భావించారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం  రూ.471 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పీఐఎఫ్‌ (పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ) పనులు 2019లో ప్రారంభించారు. కరోనా సవాళ్లను అధిగమించి ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు రేయింబవళ్లు శ్రమించి ప్రాజెక్టు పూర్తి చేశారు.
 
 షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానం చేస్తూ పీఐఎఫ్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొదటి ప్రయోగ వేదికలో వసతులు ఏర్పాటయ్యాయి. ‘ఇంటిగ్రేషన్‌ ఆన్‌ప్యాడ్‌, ఇంటిగ్రేషన్‌ ట్రాన్స్‌ఫర్‌ టు ప్యాడ్‌’ అనే రెండు అంశాలను మొదటి ప్రయోగ వేదికకు జోడించి పనులు చేశారు. 
 
పీఐఎఫ్‌లో వాహక నౌకను అనుసంధానం చేసి, పూర్తి సాంకేతిక పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రయోగ వేదిక వద్దకు తెస్తారు. మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ను (ఎంఎస్‌టీ) ప్రయోగ వేదికకు తరలించి ఉపగ్రహాన్ని వాహక నౌకకు అనుసంధానం చేస్తారు. ఉష్ణ కవచాన్ని వాహక నౌకను అనుసంధానం చేసిన అనంతరం ఎంఎస్‌టీని ప్రయోగ వేదిక నుంచి 200 మీటర్ల దూరం తీసుకెళ్తారు. 
 
ప్రయోగ వేదికపై వాహక నౌక ఉన్న సమయంలో వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఇబ్బంది లేకుండా ఎంఎస్‌టీ సేవలు వినియోగించే వెసులుబాటు ఉంటుంది. 
పీఐఎఫ్‌ భవనం ఎత్తు 15 అంతస్తులుగా ఉంటుంది. దాని ఎత్తు 66 మీటర్లు, వెడల్పు 35 మీటర్లు, పొడవు 35 మీటర్లు.  రాకెట్‌ అనుసంధానం కోసం పది స్థిర ప్లాట్‌ఫారాల ఏర్పాటు చేస్తున్నారు.