ఉక్రెయిన్లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని, చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ డెన్మార్క్ చేరుకొని, ఆ దేశ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ సంక్షోభం గురించి ఇద్దరూ చర్చించారు. భారత్ తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని విరమించడానికి రష్యాను ఒప్పించాలని డెన్మార్క్ ప్రధాని కోరారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఇరుదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. తక్షణమే శత్రుత్వాన్ని విడనాడాలని విజ్ఞప్తి చేశాయి.
దీంతోపాటు అనేక ద్వైపాక్షిక అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. పవన విద్యుత్, షిప్పింగ్, కన్సల్టెన్సీ తదితర రంగాల్లో 200పైగా డెన్మార్క్ కంపెనీలు ఇప్పటికే భారత్లో పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు. భారత్లో వ్యాపార అనుకూల పరిస్థితులు ఉన్నాయని, డెన్మార్క్ కంపెనీలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు.
అనంతరం ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత్లోని మౌలిక సదుపాయాల రంగం, గ్రీన్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని డెన్మార్క్కు చెందిన కంపెనీలు, పెన్షన్ ఫండ్లను ప్రధాని ఆహ్వానించారు. భారత్లో పెట్టుబడులు పెట్టని కంపెనీలు వ్యాపారపరంగా చాలా మిస్సవుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇండియా-డెన్మార్క్ జాయింట్ స్టేట్మెంట్ను విడుదల చేశాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం విషయంలో మద్దతు ఇస్తున్నట్టు డెన్మార్క్ ప్రధాని పునరుద్ఘాటించారు. దీనికి బదులుగా 2025-26 ఏడాదికి యూఎన్లో నాన్-పర్మనెంట్ సభ్యత్వం విషయంలో డెన్మార్క్కు భారత్ మద్దతు ప్రకటించింది.
ఇండో-యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు త్వరలోనే కొలిక్కి వస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.
అంతకుముందు డెన్మార్క్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. కోపెన్హెగెన్ విమానాశ్రయంలో మోదీకి డెన్మార్క్ ప్రధాని స్వాగతం పలికారు. అనేకమంది ప్రవాస భారతీయులు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి డెన్మార్క్ ప్రధాని స్వయంగా తన అధికారిక నివాసానికి (మ్యారీన్బోర్గ్) మోదీని తీసుకెళ్లారు. ప్రధాని హోదాలో మోదీ డెన్మార్క్లో పర్యటించడం ఇదే తొలిసారి. డెన్మార్క్కు రావడానికి ముందు… ప్రధాని మోదీ జర్మనీ పర్యటనలో ప్రవాస భారతీయుల స్పందన, ఉత్సాహం చర్చనీయాంశంగా మారాయి. జర్మనీలోని భారతీయులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు.. ‘2024, మోదీ వన్స్మోర్’ అంటూ నినదించారు. సమావేశానికి వేదికైన బెర్లిన్లోని ఓ థియేటర్ ఈ నినాదంతో మార్మోగింది. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 2014 నాటికి దేశంలో 200-400 స్టార్ట్పలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు వీటి సంఖ్య 68 వేలకు చేరిందని తెలిపారు.
డెన్మార్క్ పర్యటనలో కూడా ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. భారతీయులు ఎక్కడికెళ్లినా కర్మభూమి (పనిచేస్తున్న దేశం) కోసం నిజాయతీతో శ్రమిస్తారని ఆయన కొనియాడారు. తమ దేశాల్లోని భారతీయుల విజయాల గురించి ఎంతోమంది దేశాధినేతలు తనతో చెప్పారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సెన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ‘‘రాజకీయ నాయకుడిని ఎలా ఆహ్వానించాలో మీకు చాలా బాగా తెలుసు. దీని గురించి మా ప్రజలకు చెప్పండి’’ అని భారతీయులను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.
More Stories
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు
ఉగ్రవాదంపై సరళంగా వ్యవహరించే ప్రభుత్వం కోరుకొంటున్న టిఎంసి