కొచ్చిలో హైడ్రోజన్‌తో నడిచే విద్యుత్ నౌకల నిర్మాణం

హరిత నౌకానిర్మాణం వైపుగా కోచ్చి షిప్‌యార్డ్ అడుగులు పడుతున్నాయి. హైడ్రోజన్‌తో నడిచే విద్యుత్ నౌకలను కోచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్(సిఎస్‌ఎల్) మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించనున్నట్లు కేంద్ర రేవులు, నౌకానిర్మాణ, జలమార్గాల మంత్రి సర్బనానంద సోనోవాల్ వెల్లడించారు. 
 
 హరిత నౌకానిర్మాణంపై శనివారం నాడిక్కడ ఒక వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభిస్తూ తన భారతీయ భాగస్వాములతో కలసి సిఎస్‌ఎల్ ఈ ప్రాజెక్టును చేపడుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రోజెన్‌తో నడిచే ఎలెక్ట్రిక్ నౌకలను నిర్మించాలన్నదే ప్రభుత్వ యోచనని ఆయన తెలిపారు. 
 
ఈ ప్రాజెక్టులో సిఎస్‌ఎల్‌తో కెపిఐటి టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండియన్ రిజిస్ట్రార్ ఆఫ్ షిప్పింగ్ భాగస్వామ్యమవుతున్నట్లు ఆయన చెప్పారు. ఫ్యూయల్ సెల్ ఎలెక్ట్రిక్ వెసెల్‌గా పిలిచే ఈ నౌక నిర్మాణానికి రూ. 17.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా అందులో 75 శాతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందచేస్తుందని మంత్రి చెప్పారు.