ఆంగ్‌ సాన్‌ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష

మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 
 
మయన్మార్ లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఆమెను గత సంవత్సరం ఫిబ్రవరి 1 న అరెస్టు చేశారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పదవి నుంచి తొలగించారు. ఆమెతోపాటు పలువురు నేతలను కూడా నిర్బంధం లోకి తీసుకున్నారు. సైనిక ప్రభుత్వం  సూకిపై 11 అవినీతి కేసులను మోపింది. 
 
ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్లను నగదు, 11.4 కిలోల బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు కావడం విశేషం. 
 
మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే  ఆమె మరింత శిక్షపడే అవకాశం ఉంది.  ఇదిలా ఉండగా.. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర‍్సన్‌గా ఉన్న ప్రజానేత ఆంగ్‌ సాన్‌ సూకీ.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేసింది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.