కార్మికుల ఫిర్యాదుపై ఇన్ఫోసిస్‌ తో కేంద్రం ఉమ్మడి సమావేశం

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ ’(ఎన్‌ఐటీఈఎస్‌) కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో, దానికి  సంబంధించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ యాజమాన్యం, కార్మిక ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసింది. ఆ మేరకు కంపెనీ యాజమాన్యంకు నోటీసులు అందజేసింది. 
 
ఆ మేరకు గురువారం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశం నేడు జరుగుతున్నది. ఈ చర్చల్లో ఏ నిర్ణయం వెలువడుతుందో తెలుసుకునేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇన్ఫోసిస్ గ్రూప్ హెచ్‌ఆర్‌ విభాగం హెడ్ క్రిష్ శంకర్‌కు పంపిన నోటీసు ప్రకారం…“గురువారం ఐటీ ఉద్యోగుల సమస్యపై  కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చీఫ్ లేబర్ కమిషనర్ ముందు ఉమ్మడి చర్చ జరపాలని నిర్ణయించాం.”  కార్మిక మంత్రిత్వ శాఖ సమక్షంలో జరిగే ఈ చర్చల్లో ఇన్ఫోసిస్ అధికారులతో పాటు, ఎన్‌ఐటీఈఎస్‌ ప్రతినిధులను కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
 
ఈ సందర్భంగా ఎన్‌ఐటీఈఎస్‌ జనరల్ సెక్రటరీ హర్‌ప్రీత్ సలూజా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు తాము పనిచేసిన క్లయింట్లకు  మరో సంస్థలో చేరినప్పుడు సేవలు అందించ కూడదంటూ నిబంధనల్ని విధించామని, పోటీ నియంత్రణ ఒప్పందంలో ఈ పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. 
 
ఆ నిబంధనలు నచ్చకనే దాదాపు 100 మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు యూనియన్‌ను సంప్రదించారని పేర్కొన్నారు.  కాగా ఇన్ఫోసిస్ తమ కంపెనీ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగులందరికీ కొత్త నియమాన్ని విధించింది. దీని ప్రకారం, ఇన్ఫోసిస్‌లో రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు టీసీఎస్‌, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్, విప్రో వంటి కంపెనీల్లో పనిచేయకూడదు.
 
ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు ఐక్యంగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27ను ఇన్ఫోసిస్‌ ఉల్లంఘించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు  కేంద్ర కార్మిక శాఖ.. ఇన్ఫోసిస్‌ యాజమాన్యం, ఐటీ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.