చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ రద్దు చేసిన పాక్

పాకిస్థాన్‌ లోని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సిపిఈసీ) అధారిటీని రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారి చేసింది. దీనిని వనరులను వృథా చేసే అనవసమైన సంస్థగా ప్రణాళిక మంత్రి అషన్‌ ఇఖ్బాల్‌ ఆదేశాల్లో పేర్కొన్నారు.

2019 లో ఇమ్రాన్‌ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల (60 బిలియన్‌ డాలర్లు)తో సీపీఈసీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రావిన్సు నుంచి పాక్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్సు పరిధిలో ఉన్న గదర్‌ ఓడరేవు మధ్య మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళిక ఇది. ఇప్పటికే దీనిపై దాదాపు సగం వ్యయం చేసినట్లు చైనా చెబుతోంది. అయితే ఈ అథారిటీని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది.

కాగా, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పటిష్ఠ భద్రత కల్పించాలంటూ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖను ఆదేశించారు. గురువారం రాత్రి లాహౌర్‌లో తన మద్దతుదారులతో ఇమ్రాన్‌ ర్యాలీని ఏర్పాటు చేశారు.
ఈ ర్యాలీకి భద్రతపరంగా ముప్పు ఉన్నట్లు సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరించడంతో వర్చువల్‌ సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఇమ్రాన్‌ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ రక్షణకు తక్షణం పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిందిగా షెహబాజ్‌ షరీఫ్‌ అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌ ద్వారా పేర్కొంది.

మరోవంక, పాక్‌ సర్కారులో కీలక భాగస్వామ్య పక్షమైన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ఒత్తిడి మేరకు విదేశీ వ్యవహారాల్లో ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా ఉన్న మాజీ రాయబారి తారిఖ్‌ ఫతేమి (77)ని ఆ బాధ్యతల నుంచి షెహబాజ్‌ తప్పించారు. ఈ చర్యతో పాక్‌ సంకీర్ణ సర్కారు సారథి షెహబాజ్‌ షరీఫ్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇలా ఉండగా, పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యక్తిగతమైన పరోక్ష విమర్శలు గుప్పించారు. తన ప్రభుత్వ పతనానికి కొన్ని బలీయమైన శక్తుల తప్పుడు చర్యలే కారణమంటూ ధ్వజమెత్తారు. ” ఒక వ్యక్తి తప్పిదాన్ని మనం ఆ సంస్థకు ఆపాదించలేం ” అంటూ ట్వీట్‌ చేశారు.

 
 పాక్‌లోని కుటుంబసభ్యులు ‘మిస్సింగ్‌’గా పరిగణిస్తున్న ఇమ్రాన్‌ మద్దతుదారులు ఇద్దరు గురువారం బ్రిటన్‌ చేరుకొన్నారు. ఇందులో ఒకరు రిటైర్డ్‌ సీనియర్‌ ఆర్మీ అధికారి ఆదిల్‌ రజా.