ప్రజా ఆకాంక్షలకు తూట్లు పొడిచి ఆగం చేస్తున్న కేసీఆర్

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు తూట్లు పొడిచి ఆగం చేశాడని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి విమర్శించారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఎనిమిదో రోజైన గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాలగొంతు కేసీఆర్ కు తెలంగాణ ప్రజల కంటే.. ఆయన కుటుంబం పైనే ధ్యాస, ప్రేమ ఎక్కువ అని ఎద్దేవా చేశారు.
ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు తప్ప అభివృద్ధి శూన్యం అని ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర జరగకుండా బిజెపి కార్యకర్తలను భయపెట్టి, పోలీసులతో అడ్డుకోవాలని చూస్తున్నాడని మండిపడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన బండి సంజయ్ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారు సెలవు అనేది లేకుండా పేద ప్రజల సంక్షేమం కోసం, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చేందుకు, పేదలకు గూడు కల్పించేందు కోసం అనునిత్యం శ్రమిస్తున్నారని అన్నామలై గుర్తు చేశారు.  పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు కట్టిస్తున్నారని,  మహిళల ఆత్మగౌరవం కాపాడేలా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేదింట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిందని వివరించారు.

నరేంద్ర మోదీ పాలనలో అవినీతి మచ్చ లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని కొనియాడారు. కాని, రాష్ట్రంలో టీఆర్ఎస్ మంత్రులంతా అవినీతిపేరును మూటగట్టుకున్నారని అన్నామలై ఆరోపించారు. కృష్ణా-తుంగభద్ర నడుమ ఉన్న గద్వాల ఉంది. కాని, చుక్కనీరు రాలేదని చెబుతూ  అందుకు   కారణం.. కేసీఆర్ అసమర్థ పాలనే అని స్పష్టం చేశారు.

హుజురాబాద్ ఎన్నికలప్పుడు దళితులందరికీ దళితబంధు ఇస్తానని కేసీఆర్ చెప్పిండని గుర్తు చేస్తూ  కాని రాష్ట్రంలో మరెక్కడా దళితబంధు ఇవ్వలేదని, వారికి ఇస్తామన్నా  3 ఎకరాలు రాలేదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్… కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు కానివ్వకుండా పేదలను హింసిస్తున్నడని అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 ఆయుష్మాన్ భారత్ సహా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను అమలు కానివ్వడం లేదని గుర్తు చేశారు.  యువతకు ఉద్యోగాలిస్తానని చెప్పిన కేసీఆర్.. కొలువులివ్వకుండా, నోటిఫికేషన్లు వేయకుండా తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేస్తే అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్న దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. 

నేడు రాష్ట్రంలో లిక్కర్ నే ఆదాయ వనరుగా మలుచుకొని ప్రజలను మద్యానికి బానిసలుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తుందని అన్నామలై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం ఉద్యోగాల్లో కావాలి.. కానీ, లిక్కర్ లో కాదని స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ అని చెబుతూ,  కాని, ఆమె  పట్ల సాంస్కారహీనంగా సోషల్ మీడియాలో దిష్టిబొమ్మలా అవమానపర్చడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.