గతం కన్నా పటిష్టంగా బ్రిటన్-భారత్ సంబంధాలు

బ్రిటన్-భారత్ సంబంధాలు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉన్నాయని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆయన రెండో రోజు భారత్ పర్యటన శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. గురువారం ఆయన గుజరాత్‌లో పర్యటించిన శుక్రవారం ఢిల్లీలో ఉన్నారు. 
 
 ఉదయం బోరిస్ జాన్సన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికిన అనంతరం జాన్సన్‌ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు భారత దేశానికి ధన్యవాదాలు తెలిపారు.
ఆయనకు స్వాగతం పలికినవారిలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా ఉన్నారు. తర్వాత సైనిక వందనం స్వీకరించారు. పలువురు నేతలు, అధికారులతో కలిశారు. రాజ్ ఘాట్ దగ్గర మహాత్మా గాంధీకి బ్రిటిష్ ప్రధాని  నివాళులర్పించారు. 
బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన తొలి బ్రిటన్ ప్రధాన మంత్రి ఆయనే. శుక్రవారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘నా మిత్రుడు నరేంద్ర మోదీని నేడు న్యూఢిల్లీలో కలవడం కోసం ఎదురు చూస్తున్నా’’నని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి రంగాల్లో తమ ప్రజాస్వామిక దేశాల భాగస్వామ్యం చాలా కీలకమైనదని తెలిపారు. నిరంకుశ దేశాల నుంచి ప్రపంచానికి ముప్పు పెరుగుతున్న దశలో ప్రజాస్వామిక దేశాల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదని తెలిపారు.
 
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా భారతీయ వృత్తి నిపుణులకు మరిన్ని వీసాలు మంజూరు చేసే అంశంపై జాన్సన్‌ సానుకూలత వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఉండటం చాలా అద్భుతంగా ఉందని ఆయన ట్వీట్‌ చేశారు. 
 
కాగా, ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం విషయంలో భారత్‌ తటస్థ వైఖరిపై తాను మోదీకి లెక్చర్లు దంచబోవడం లేదని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా యూకే, రష్యా మధ్య ఉన్న సంబంధాల కంటే భారత్‌, రష్యా చారిత్రకంగా చాలా భిన్నమైన సంబంధాలను కలిగి ఉన్నాయని అందరికీ అర్థమైందని భావిస్తున్నట్లు తెలిపారు. 
మోదీ, జాన్సన్ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ పర్యటనపై జాన్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్, భారత్ భాగస్వామ్యం వల్ల వచ్చిన అద్భుతమైన ఫలితాలను గుజరాత్‌లో చూస్తుండటం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని గురువారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
గుజరాత్ లో ప్రముఖ  పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని బోరిస్‌ జాన్సన్‌ కలిశారు. ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌, వాతావరణం, ఏరోస్పేస్‌, రక్షణ రంగంలో సహకారం తదితర కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. యూకే ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ స్కాలర్‌షి్‌పల్లో ఒకటైన చెవెనింగ్‌ స్కాలర్‌షిప్‌ ద్వారా భారత యువత కోసం అకడమిక్‌ ఫెసిలిటేషన్‌ ప్రోగ్రామ్‌ను సైతం అదానీ ప్రకటించారు.
జూన్‌ 28న లండన్‌లో జరగనున్న ఇండియా-యూకే క్లైమేట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సదస్సుకు రావాలని బ్రిటన్‌ ప్రధానిని ఆయన ఆహ్వానించారు. కాగా గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలసి బోరిస్‌ జాన్సన్‌ వడోదర సమీపంలోని హలోల్‌ పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లారు.
 అక్కడ బ్రిటన్‌కు చెందిన బుల్‌డోజర్ల తయారీ కంపెనీ జేసీబీని సందర్శించి, రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్లాంట్‌ పరిసరాలను పరిశీలిస్తున్న సందర్భంగా ఆయన హఠాత్తుగా అక్కడే ఉన్న ఒక బుల్‌డోజర్‌పైకి ఒక్క ఉదుటున ఎక్కారు. డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చొని స్టార్ట్‌ చేసే ప్రయత్నం చేశారు.