పేదలను ఇబ్బంది పెట్టిన వారిపై బుల్డోజర్లు వాడొద్దా?

శ్రీరామ నవమినాడు హింసాత్మక సంఘటనలకు పాల్పడిన నిందితులకు వ్యతిరేకంగా బుల్డోజర్లను ఉపయోగించకూడదా? అని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. ఖర్గోన్‌లో శ్రీరామ శోభాయాత్రలో పాల్గొన్నవారిపై దాడి చేసినవారికి చెందిన ఆస్తులను బుల్డోజర్లతో కూలగొట్టడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సీఎం ఈ ప్రశ్న అడిగారు. 
చౌహాన్ భోపాల్‌లో ఓ సభలో మాట్లాడుతూ, ఖర్గోన్‌లో పేదల ఇళ్ళను తగులబెట్టారని, బాధితులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారికి ఇళ్ళను నిర్మించి ఇవ్వడానికి ‘మామ’ ఉన్నారని చెప్పారు. పేదల ఇళ్లను తగులబెట్టినవారి నుంచి నష్టపరిహారాన్ని రాబడతామని స్పష్టం చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆత్మీయంగా ‘మామ’ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.
ప్రశాంతతకు భంగం కలిగించాలని కొందరు కుట్ర పన్నుతున్నారని చౌహాన్ ఆరోపించారు. తన ప్రభుత్వం ప్రజలకు పువ్వు కన్నా మృదువైనదని, అయితే రాష్ట్రంలో గూండాలు, నేరగాళ్ళను మనుగడ సాగించనివ్వబోమని చెప్పారు. తాము వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం శోభాయాత్రలు జరిగాయి. మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్, బార్వానీలలో ఈ యాత్రలపై దుండగులు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. వాహనాలు, ఇళ్లను తగులబెట్టారు. భక్తులను గాయపరిచారు.  పోలీసులు 24 కేసులను నమోదు చేసి, 250 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 95 మందిని అరెస్టు చేశారు. ఈ విధ్వంసంలో జరిగిన నష్టాన్ని రాబట్టేందుకు విశ్రాంత జిల్లా జడ్జి శివ కుమార్ మిశ్రా నేతృత్వంలో ఓ ట్రైబ్యునల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.