జి7 సమావేశాలకు భారత్‌కు జర్మనీ ఆహ్వానం

జి7 సమావేశాలకు భారత్‌కు ఆహ్వానం పంపిస్తున్నట్టు జర్మనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో(26-28 తేదీలు) బవేరియన్‌ ఆల్ప్స్‌లో జరుగనున్న జి-7 దేశాల సదస్సును జర్మనీ నిర్వహిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌తో రష్యా సైనికచర్యలపై భారత్‌ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఈ జి-7 సమావేశాలకు జర్మనీ భారత  ప్రధాని మోడీని ఆహ్వానించడం లేదనే వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. 

ఈ వార్తలను జర్మనీ తోసిపుచ్చింది. త్వరలోనే భారత్‌కు ఆహ్వానం అందనుందని కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ ఏడాది జరగనున్న జి-7 సదస్సుకు సెనిగల్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా దేశాలను జర్మనీ ఆహ్వానించింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే సమయంలో జరిగిన ఓటింగ్‌లో భారత్‌ పాల్గొనలేదు.  రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో కూడా భారత్‌ సానుకూలంగా స్పందించింది. అలాగే యుద్ధం జరుగుతున్న సయమంలోనే రష్యా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడంతో పాటు భారత్‌కు పలు ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

దీంతో ఈ ఏడాది భారత్‌కు ఆహ్వానం అందడం లేదనే వార్తలు వచ్చాయి. అయితే, 2019 నుండి జి-7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ను ఆహ్వానించడం వరుసగా ఇది నాల్గవసారి. 2020 జూన్‌లో సమ్మిట్‌ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా సదస్సు జరగలేదు. 2021లో బ్రిటన్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఆహ్వానించింది. ఆ సమయంలో బ్రిటన్‌లో కరోనా రెండో  వేవ్‌ కారణంగా వర్చువల్‌ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొన్నారు.