ప్రజల దృష్టిని మళ్లించడానికే ఢిల్లీలో కేసీఆర్ ధర్నా

తెలంగాణలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తుండు, తన రాజకీయాల కోసం రైతులను కేసీఆర్ వాడుకుంటున్నడు అంటూ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు.

ఆయన ఒక పెద్ద అబద్ధాలకోరు. కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదని ఆమె ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని,  సీఎం కేసీఆర్ తన తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్, శ్రీలంక దేశాల అప్పుల కంటే తెలంగాణ అప్పులే ఎక్కువ అని ఆమె ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని పేర్కొంటూ  మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో కేసీఆర్‌లో వణుకు మొదలైందని ఆమె విమర్శించారు.

అందుకే ప్రజలు బీజేపీ వైపు వెళ్లకుండా… సమస్యలపై తనను నిలదీయకుండా ఆపడానికి ఈ దొంగ ధర్నాలు షురూ జేసిండు అని ఆమె దుయ్యబట్టారు. ఈ ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించవని విజయశాంతి స్పష్టం చేశారు.  ఆయన దగ్గర రాష్ట్రాలు తిరగడానికి… ఎన్నికల కోసమని పార్టీకి వ్యూహకర్తల్ని నియమించుకోవడానికి డబ్బులుంటాయి కానీ, వడ్లు కొనడానికి, రైతులకి ఇవ్వడానికి మాత్రమే డబ్బులు లేవా? అని ఆమె ప్రశ్నించారు.

మిల్లర్లతో కుమ్మక్కయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసేసి రైతులకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నడు అని విజయశాంతి విమర్శించారు.  పంజాబ్ నుంచి కూడా రా రైస్ తప్ప బాయిల్డ్ రైస్ కొనడం లేదని ఆమె పేర్కొంటూ మాట్లాడితే పంజాబ్ పేరెత్తే కేసీఆర్‌కి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కౌంటర్ ఇచ్చిందిని ఆమె గుర్తు చేశారు. అసలు తెలంగాణ నుంచి రా రైస్ సేకరణకు ప్రతిపాదనేది రాలేదని కేంద్రం తేల్చి చెప్పిందని ఆమె తెలిపారు.

రా రైస్ ఎంతిచ్చినా తీసుకుంటామని ఎఫ్‌సీఐ రీజనల్ జీఎం కూడా చెప్పారని ఆమె స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ చేసేవన్నీ ఒట్టి నాటకాలు, చెప్పేవన్నీ ప‌చ్చి అబద్దాలని స్పష్టంగా తెలుస్తోందని ఆమె ధ్వజమెత్తారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారితోనే రైతు రాజ్యం సాధ్యం అని విజయశాంతి స్పష్టం చేశారు.  అందుకే మోదీ గారు పంట‌ల‌కు మ‌ద్దతు ధ‌ర పెంచారని,  ప్రతిపక్షాలకు ఏనాడూ అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్… మోదీ  తనకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని చెబుతుంటే నవ్వొస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఎన్ని డ్రామాలాడినా తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపలేరని విజయశాంతి స్పష్టం చేశారు. తెలంగాణ‌లో ఖ‌చ్చితంగా బీజేపీ జెండా ఎగ‌ర‌డం ఖాయం అని స్పష్టం చేశారు.