నితీశ్‌ కుమార్‌ సభలో పేలుడు కలకలం

బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభలో పేలుడు కలకలం రేగింది. నలందలో నిర్వహించిన జనసభకు 20 ఫీట్ల దూరంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో అప్రమత్తమైన సీఎం భద్రతా సిబ్బంది నితీశ్ కుమార్ ను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. 
 అయితే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ఎవరికీ ఏం కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్‌ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.
నితీశ్ కుమార్ పై దాడి జరగడం 20 రోజుల్లో ఇది రెండోసారి. ఇటీవలే పట్నాకు సమీపంలోని భక్తియార్ పూర్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఓ వ్యక్తి సీఎంపై దాడి చేశాడు.
విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న సమయంలో వేదికపైకి వచ్చిన యువకుడు నితీశ్ కుమార్ వీపుపై కొట్టాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగున్ని అదుపులోకి తీసుకున్నారు.