మెజారిటీ కోల్పోవడంతో శ్రీలంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది.దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనిరీతిలో ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. 41 మంది ఎంపీలు మంగళవారం పాలక సంకీర్ణానికి రాజీనామా చేశారు. దీంతో రాజపక్సా ప్రభుత్వం మైనారిటీలో పడింది. 
 
ఆర్థిక మంత్రి అలీ సబ్రీని నీయమించిన 24 గంటల్లోనే రాజీనామా చేయడంతో  పాలక పక్షానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. రుణ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో కీలకమైన చర్చలు జరగాల్సి వున్న నేపథ్యంలో మంత్రి రాజీనామాతో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి.
 
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఆహారం, పెట్రోల్‌లతో పాటు నిత్యావసరాల ధరలు పెరిగిపోయి తీవ్రమైన అశాంతికి ఎదుర్కొంటున్న శ్రీలంకలో మరోవంక నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. క్యూల్లో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ పెట్రోల్‌ లభించడం లేదని ఆందోళనకారులు పేర్కొంటున్నారు.
గత కొన్ని రోజులుగా ప్రధాని మహేంద్ర రాజపక్సా నివాసం ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. కర్ఫ్యూ ఆంక్షలను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ప్రజలు ఈ నిరసనల్లో పాల్గంటున్నారు. మంగళవారం వర్షం కురుస్తున్నప్పటికీ.. నిరసనకారులు భారీ ర్యాలీ చేపట్టారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సా అధికార కూటమి నుండి మిత్రపక్షాలు వైదొలగడంతో పార్లమెంటులో ఆయన మెజారిటీని కోల్పోయారు.
 
అధికార శ్రీలంక పోడుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నామని 42 మంది ఎంపిలు మంగళవారం ప్రకటించారు. వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్ర పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. 
 
తాము స్వతంత్ర సభ్యులుగా ఉంటామని  ఫ్రీడమ్‌ పార్టీ నేత మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. కాగా, రాజపక్స మినహా మంత్రులంతా ఆదివారం తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  
 
కేవలం నలుగురు మంత్రులను మాత్రమే కొనసాగిస్తున్నట్టు వెల్లడించిన గొటబయ… సోమవారం తన సోదరుడు, ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సను కూడా పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో అలీ సర్బీకి ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సోమవారం వెల్లడించారు. 
 
అయితే ఈ పదవి చేపట్టిన 24 గంటల్లోపే సర్బీ రాజీనామా చేయడం గమనార్హం.  ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాను ఆర్థిక మంత్రిగా కొనసాగలేనని, ఆ స్థానంలో మరో ప్రత్యామ్నాయ వ్యక్తిని నియమించాలని ఆయన తన  రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 
 
కాగా, శ్రీలంకలో  ఆందోళనలు మిన్నంటడంతో ఆస్ట్రేలియా, నార్వే, ఇరాక్‌ దేశాలు  తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మాసివేశాయి. మరోవంక, నార్వే రాజధాని ఓస్లో, ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని రాయబార కార్యాలయాలతో పాటు సిడ్నీ లోని వాణిజ్య రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకోవడంతో శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది.