మూడు నెలల్లో ఎన్నికలు సాధ్యం కాదన్న పాక్ ఎన్నికల కమీషన్!

అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనలేక జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో ఎన్నికలు జరిపించి, తిరిగి ప్రధానిగా గెలవాలని పధకం వేసుకున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ ఎన్నికల కమీషన్ నుండి చుక్కెదురైంది. 
 
వివిధ కారణాలను చూపుతూ ఈ ఎన్నికలను నిర్వహించడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పింది. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, లాజిస్టికల్ సవాళ్ల వల్ల ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది .  
 
 ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై పాకిస్థాన్ పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆదివారం తిరస్కరణకు గురైంది.  వెంటనే పార్లమెంటును రద్దు చేయాలని, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి సిఫారసు చేశారు.
కాసేపట్లోనే నేషనల్ అసెంబ్లీని రద్దు చేసినట్లు అల్వీ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరుగుతోంది.
ఎన్నికల కమిషన్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ముఖ్యంగా కైబర్ పక్తూంక్వాలో నియోజకవర్గాలు పెరగబోతుండటం, జిల్లా, నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయడం ప్రధాన సవాళ్ళు. ఎన్నికల నిర్వహణకు కనీసం ఆరు నెలలు అవసరమని పేర్కొన్నది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఒక నెల సమయం ఇవ్వాలని చట్టం చెప్తోంది. ఎలక్షన్ మెటీరియల్‌ను సేకరించడం, బ్యాలట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సిబ్బందికి శిక్షణనిచ్చి, నియమించడం వంటివాటికి కూడా సమయం అవసరమవుతుంది.
వీటన్నిటికీ బిడ్‌లను ఆహ్వానించి, తనిఖీ చేసి, ఖరారు చేయడానికి కూడా సమయం పడుతుంది. 1 లక్ష పోలింగ్ స్టేషన్లకు ఈ ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం, ఎన్నికల షెడ్యూలును నాలుగు నెలల ముందుగా ప్రకటించవలసి ఉంటుంది.
బలూచిస్థాన్‌ లోకల్ గవర్నమెంట్ ఎన్నికలు మే 29న జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదేవిధంగా పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్ లోకల్ గవర్నమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది.