సోషల్ మీడియాలోనే కనిపిస్తున్న కేజ్రీవాల్ ప్రభంజనం!

గుజరాత్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభంజనం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ ప్రభంజనం అని చెప్తున్నదానిని సోషల్ మీడియాలో మాత్రమే సృష్టిస్తున్నారని, క్షేత్రస్థాయిలో అదేమీ లేదని స్పష్టం చేశారు.
 
ఈ సంవత్సరం చివరిలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ తో కలసి గుజరాత్ లో రెండు   పర్యటించి, శనివారం అహ్మదాబాద్ లో `తిరంగ యాత్ర’ పేరుతో  రోడ్ చేసిన కేజ్రీవాల్ రాష్ట్రంలో అన్ని సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ సందర్భంగా తమ పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. అంతకు ముందు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.
చండీగఢ్‌లో అనురాగ్ ఠాకూర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ మీడియాలో మాత్రమే ఓ వాతావరణాన్ని సృష్టిస్తారని, క్షేత్ర స్థాయిలో అటువంటిదేమీ లేదని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, కేజ్రీవాల్ ఎలా ఓటమిపాలయ్యారో అందరికీ తెలుసునని గుర్తు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కనీసం ఒక స్థానమైనా దక్కలేదని పేర్కొన్నారు. కొన్నిసార్లు వారు మీడియా ద్వారా ఓ వాతావరణాన్ని సృష్టిస్తారని, అయితే క్షేత్రస్థాయిలో ఏమీ ఉండదని  ఠాకూర్ స్పష్టం చేశారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యధికులు అభిమానిస్తున్న నేత అని అనురాగ్ ఈ సందర్భంగా కొనియాడారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయన పేరు మీద ఏకపక్షంగా బీజేపీకి ఓట్లు పడతాయని భరోసా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో మళ్లీ బీజేపీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఓటమి గురించి ప్రస్తావించినపుడు ఠాకూర్ మాట్లాడుతూ, 2027లో జరిగే శాసన సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో తాము ప్రచారం ప్రారంభించడం ఆలస్యమైందని పేర్కొన్నారు.

\