టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీకి పూర్తి ఆధారాలు ఇవ్వని ఎక్సైజ్‌

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో తాము సేకరించిన ఆధారాలను దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా ఇవ్వకుండా రెండేళ్లుగా తాత్సార్యం చేస్తున్న రాష్త్ర  ఎక్సైజ్‌ శాఖ చివరకు హైకోర్టు లో కోర్ట్ ధిక్కరణ పిటీషన్ దాఖలు చేయడంతో ఇచ్చినప్పటికీ, ఇచ్చిన వివరాలు పూర్తిగా లేవని ఈడీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన ఆధారాలను ఈడీ క్షుణ్ణంగా పరీశీలిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఈడీకి కీలక ఆధారాలను సమర్పించింది.  టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో డిజిటల్‌ రికార్డ్స్‌, చార్జ్‌ షీట్స్‌, కాల్‌ డిటెయిల్స్‌ను ఈడీకి ఎక్సైజ్‌ శాఖ ఇచ్చింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో 800 పేజీల మొత్తం ఫైల్స్‌ను పరీశీలిస్తున్నామని ఈడీ వెల్లడించింది.
60 జీబీ వీడియో 10 ఆడియో ఆధారాలను క్షుణ్ణంగా ఈడీ పరిశీలిస్తోంది. డ్రగ్స్‌ లావాదేవీలు, మనీ ల్యాండరింగ్‌ వ్యవహారంపై ఈడీ కూపీ లాగుతోంది. 2017లో సేకరించిన ఆధారాలను పరీశీలించిన తర్వాత మరోసారి సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది.  ఇదిలా ఉండగా, ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయని ఈడీ గుర్తించింది.
డ్రగ్స్‌ కేసులో చాలా మందిని విచారించిన ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాటన్నింటినీ తమకు ఇవ్వలేదని, కేవలం 12 వీడియో ఆధారాలను మాత్రమే ఇచ్చిందని ఈడీ పేర్కొంది.  అంతేకాకుండా డిజిటల్‌ ఆధారాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయని, కొన్నింటిలో అసలు సమాచారం లేదని తెలిపింది. డ్రగ్స్‌ కేసులో విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలను ఇవ్వకపోవడం పట్ల ఈడీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ ఎక్సైజ్‌ శాఖ, ప్రభుత్వం కావాలని తమకు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం సరైంది కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  మరో పక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదరశి  సోమేష్‌కుమార్‌, ఎక్సైజ్‌ శాఖ సంచాలకులు సర్పరాజ్‌ అహ్మద్‌లపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ కోసం ఈడీ ఎదురు చూస్తోంది.