యుగనుకూల పరివర్తనకు దిశ చూపించిన డాక్టర్ హెడ్గేవార్

రాంపల్లి మల్లికార్జునరావు 

రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించిన పరమపూజ్య డాక్టర్ జీ జన్మించి ఈ ఉగాదికి 133 సంవత్సరాలు పూర్తియ్యా 134సంవత్సరంలో అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా వారి జీవితం లోని కొన్ని విషయాలు మననం చేసుకుందాం. డాక్టర్ జీ జన్మించే నాటికీ దేశంలో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ పరిస్థితుల్లో దేశంలో మార్పు కోసం డాక్టర్ జీ చేసిన ప్రయత్నాలను అర్ధం చేసుకోవచ్చు.

డాక్టర్జీ   దేశ స్వాతంత్ర పోరాటంలో పని చేస్తూ చేస్తున్న సందర్భంగా తనకు  వచ్చిన అనేక అనుభవాలను ఆధారం చేసుకుని హిందూ సమాజ సంరక్షణ కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించారు.  డాక్టర్జీ  అనుభవాలు ఆనాటి పరిస్థితులు మనం అర్ధం చేసుకుంటే సంఘం ఎందుకు అనేది మనం తెలుసుకోగలుగుతాం.    డాక్టర్ జీ  జీవితాన్ని మూడు భాగాలుగా చేసుకుని ఆలోచించవచ్చు

తొలి రోజులు 

డాక్టర్ జీ బాల్యం నుండి కలకత్తాలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసే వరకు విప్లవ భావాలతో ఆవేశాలతో పని చేసారు. కలకత్తాలో అనుశీలన సమితిలో  పనిచేసారు డాక్టర్ కోర్స్ పూర్తి చేసి 1916లో కలకత్తా నుండి నాగపూర్ చేరుకొని,  1916లో ఉగాది రోజున డాక్టర్ జీ  ప్రేరణతో అప్పాజీ జోషి రాష్ట్రీయ స్వయంసేవక్ మండల్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు.

ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటానికి వేదికలైన కాంగ్రెస్, హిందూ మహాసభలలో పనిచేస్తూ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ సమయం లోనే   పత్రికలూ కూడా  నడిపారు.  సామాజిక సమస్యల పరిష్కారంకు అనేక ప్రయత్నాలు చేసారు.  సామాజిక పరిస్థితులను అధ్యయనం కూడా చేశారు. ఒక ప్రక్క స్వాతంత్ర ఉద్యమంలో పనిచేస్తూనే అనేక అనుభవాల ఆధారంగా 1925లో  విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ప్రారంభించారు.

1930 జూలై 22న  అటవీ సత్యాగ్రహం చేసారు.  అటవీ సత్యాగ్రహం కారణంగా మళ్ళీ  జైలు కు వెళ్లారు.   1931 ఫిబ్రవరి 14 వరకు జైలు జీవితం గడిపారు. ఆ తదుపరి డాక్టర్ జీ జీవించివున్న తొమ్మిది సంవత్సరాలు సంఘ కార్య విస్తరణ కే సమర్పించారు

1931 నుండి 1940 వరకు సంఘ విస్తరణ కోసం వారు చేసిన ప్రయత్నాలలో  మూడు విషయాలు ప్రధానంగా మనకు  కనబడతాయి. 1. దేశ స్వాతంత్ర పోరాటంకు వేదికలుగా  ప్రారంభమైన సంస్థలు రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందుతున్న సమయంలో వాటిలో చోటు చేసుకొంటున్న పరిణామాలతో సంఘం రాజకీయాలు స్వతంత్ర పోరాటానికి మధ్య సంతులనం సాదించ వలసిన ఒక చారిత్రిక అవసరం ఏర్పడింది. అందుకోసం ఆయన   పని చేసారు.

2). స్వతంత్రం కోసం జరుగుతున్న ఉద్యమాలలో సంఘం ఎట్లా పాల్గొనాలి అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 3. సమీప భవిష్యత్తులో సంఘం దేశమంతా విస్తరించి శక్తివంతం కావడం కోసం దివారాత్రులు పనిచేసారు. సంఘానికి అఖిలభారత స్వరూపం వ్యవస్థ నిర్మాణం చేసారు. శక్తి వంతమైన పునాదులు వేశారు. ఆ పునాదుల పైనే  ఈ రోజు సంఘం అప్రతిహతంగా ముందుకు పోతున్నది.

 రాజకీయ సవాళ్ళు 

పరమపూజ్య డాక్టర్జీ  స్వాతంత్ర ఉద్యమం,  దేశ రాజకీయాలు,  రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మధ్య  ఒక సంతులనం సాధించేందుకు చాలా తీవ్ర ప్రయత్నం చేశారు.  దాని కారణంగా అనేక సమస్యలు కూడా ఎదుర్కొన్నారు మద్దెలకు రెండు పక్కల వాయింపులు ఉన్నట్లుగా డాక్టర్ జీ కి ఒక పక్క కాంగ్రెస్  తీవ్ర అసహనం,  రెండో ప్రక్క  హిందూ మహాసభ తీవ్ర అసంతృప్తి ఎదుర్కొని సంఘాన్ని జాగ్రత్తగా నిలబెట్టారు.

డాక్టర్ జి  హిందూ సమాజ సంఘటన కార్యం చేయడం కాంగ్రెస్ వాళ్లకు అదేదో ముస్లిం వ్యతిరేకంగా పని చేస్తున్నారు అనే భ్రమలో చిక్కుకున్నారు.  దానితో  డాక్టర్ జీ  కి అనేక తలనొప్పులు సృష్టించేందుకు ప్రయత్నం చేసారు.  రెండో ప్రక్క హిందూ మహాసభ తాము కూడా హిందువుల గురించి పని చేస్తుండగా ఆర్ ఎస్ ఎస్  తమకు  ఎందుకు పూర్తిగా సహకరించదు?  అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండేవారు.

కాంగ్రెస్, హిందూ మహాసభ 1930 తరువాత  రాజకీయ పార్టీలుగా  మారుతూ వచ్చాయి. దానితో  డాక్టర్ జి సంఘాన్ని వాటికి  దూరంగా  నిలబెట్టారు.  ఇంకొక ప్రక్క స్వాతంత్ర ఉద్యమంలో సంఘం భాగస్వామ్యం అవుతూనే, సంఘ కార్య విస్తరణకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకున్నారు.  ఇట్లా డాక్టర్ జీ  అన్నిటి మధ్య సంతులనం సాధించి సంఘం ఒక సామాజిక సంస్థగా వికశింప  చేశారు.

మనదేశంలో ఏ కాలంలోనైనా సమాజాన్ని శక్తిమంతంగా ఉంచేందుకు సామాజిక,  ధార్మిక వ్యవస్థలను నిర్మాణం చేసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతూ,  దేశాన్ని రాజకీయ ఆధిపత్య ధోరణి నుండి కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉండే వారు.   అందుకే మన దేశం ఎప్పుడూ కూడా కేవలం రాజకీయాలు రాజ్యాధికారం మీద మాత్రమే ఆధారపడి లేదు.

ఈ విషయాన్ని గ్రహించిన   డాక్టర్ జీ రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఒక సామాజిక శక్తిని నిర్మాణం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.  అదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం.  సంఘం అంటే హిందూ సమాజం,  హిందూ సమాజం అంటే అనేక సామాజిక వ్యవస్థలు, వాటన్నిటిని సమన్వయంతో నడిపించడమే హిందూ సమాజ సంఘటన.

స్వాతంత్ర పోరాట తీరు తెన్నులు                                                      

స్వాతంత్ర పోరాట కాలంలో రెండు అంశాలపై ప్రధాన చర్చ జరిగింది.  1.  దేశానికి స్వాతంత్రం సంపాదించడం 2. ఈ దేశం లోని ముస్లింలు తమ అస్తిత్వం,  మనుగడ ప్రమాదంలో ఉంది అని ఉద్యమించడం. దేశ నాయకత్వానికి  ఈ రెండు వేర్వేరు సమస్యలు.  కానీ స్వతంత్ర పోరాటంలో ఈ రెండిటినీ కలిపి ఆలోచించడం దేశానికి కోలుకోలేని నష్టం కలిగించింది.  అంతేగాక ఈ దేశం  మానసికతలో చాలా మార్పులు తీసుకొని వచ్చింది. అవి  ఏమిటో గమనిద్దాం.

1906 తర్వాత ముస్లిం మనోభావాలలో చాలా మార్పులు వచ్చాయి.  ముస్లింలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఈ దేశంలో  ఓ ముస్లిం దేశం నిర్మాణం చేసుకోవాలని సంకల్పంతో పెద్ద ఎత్తున భేదోపాయం, దండోపాయం ప్రయోగించారు.    దాని కారణంగా ఆ రోజుల్లో ఉన్న హిందూ మహాసభ హిందువులను సామాజికంగా, సాంస్కృతం గా ఉద్ధరించాలని, దానికోసం ముస్లిముల నుండి ఎదురవుతున్న సవాళ్లను పదే పదే మాట్లాడటం ప్రారంభించారు.  మాట్లాడుతూ మాట్లాడుతూ హిందూ మహాసభ ఆలోచనలోనే  చాలా పెద్ద మార్పు వచ్చింది.   దానితో హిందువులు అంటే ముస్లిం వ్యతిరేకులుగా గాఢంగా ముద్ర పడింది,.

అదే సమయంలో కాంగ్రెస్ వారు హిందూ,  ముస్లిం ఐక్యత గురించి మాట్లాడుతూ ఉండేవారు.  ఈ విషయంలో డాక్టర్ జి ఆలోచన విలక్షణంగా ఉంది.  మాటిమాటికి హిందూ ముస్లిం ఐక్యత గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు ఈ దేశంలో ఉన్న ఇతర మతాలు  ఐక్యత గురించి   ఎందుకు మాట్లాడటం లేదు? మతాల విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.  కానీ దేశం,  జాతి,  సంస్కృతి విషయంలో ఒకే ఆలోచన ఉండాలి.

ప్రపంచమంతా అలాగే ఉంటుంది.  అంతేగాని అది కలగూర గంప లాగా ఉండదని చెప్పేవారు. కానీ, కాంగ్రెస్ మహమ్మదీయుల  అత్యాచారాలను, అత్యాశలను  భరిస్తూ నోరు మెదపకుండా వాళ్లు చేసే దాడులను వ్యతిరేకించకుండా, వాళ్లను సమర్థిస్తూ చేసిన  దేశ స్వాతంత్ర పోరాట  దుష్పరిణామం. అట్లాగే  దీనిలో బ్రిటిష్ వాళ్ళ భేద తంత్రం కూడా ఉన్నది. బ్రిటిష్ వాళ్ళకి తూర్పున ఉన్న భారత్ ను బలహీనం చేయాలంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలని వాళ్ళ యోజన. చివరకు అవి అన్ని కలగలిసి  దేశ విభజనకు దారి తీసింది.

 సమకాలీన పరిస్థితులపై  డాక్టర్ జీ హెచ్చరికలు                                  

డాక్టర్జీ  రానున్నప్రమాదాలను  గుర్తించి దేశాన్ని సూటిగా,  తీవ్రంగా హెచ్చరిస్తూ ఉండేవారు. ఆయన హెచ్చరికలు మూడు రకాలుగా ఉండెడివి.  మొదటగా,  ఒకటో  రకం ఏదో రకంగా ముస్లిం లను కలుపుకొని పోతే మాత్రమే తాము ఈ దేశానికి ప్రతినిధులుగా గుర్తింపు వస్తుంది అనే భ్రమ కలిగిన వాళ్ళు. రెండవ రకం, ఆంగ్లేయ విద్య వ్యామోహంతో ఈ దేశం  మౌలిక తత్వాన్ని గ్రహించలేక, హైందవం ఇస్లాం క్రైస్తవంల  వలె ఒక పిడివాదం కలిగిన మత వర్గము అనే భావన  ఉండేవాళ్ళు.  వీళ్లు ఒకరకంగా ఆంగ్లేయుల విధేయులు. మూడవ వర్గం మొదటి నుంచి హిందువులకు, హిందూ దేశపు  అఖండ స్వరూపానికి సంరక్షణకు శత్రువులు.   వీరివల్ల దేశానికి ఇప్పటికే చాలా నష్టం జరిగింది, ఇంకా జరుగుతుంది.

ఈ విధంగా గా దేశానికి, మన సంస్కృతికి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది అని చెబుతూ ఉండేవారు.  ఆంగ్లేయుల కుట్రలు ఏరకంగా ఉన్నాయో మనం ఇక్కడ గమనిద్దాం.  1931 ఏప్రిల్  లో డాక్టర్ ముంజే  లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లండన్ లో భారతదేశం గురించి జరుగుతున్న కుట్రలు గురించి వివరించారు.

ఆంగ్లేయులు, ముస్లింల  కుట్రల  ఫలితంగా ఈ దేశ ప్రజలను హిందువులు,  ముస్లింలు ,  దళితులు,  భారతీయ క్రైస్తవులు,  యూరేషియన్ లు,  ఆంగ్లేయులు అనే వర్గాల కింద విభజించి ప్రజాస్వామ్యం పేరిట అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకుల మీద పెత్తనం చెలాయించే విపత్కర పరిస్థితి నుండి ప్రజలను రక్షించడం తమ   విధి అని ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించింది.  ఆ ప్రకటనలో భారత జాతి విభజనకు విషబీజాలు నాటడం జరిగింది దాని పరిణామాలు మనం చూసాము.

ఆవే శక్తులు  ఈ రోజు వికృత రూపంలో ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే  ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఆంగ్లేయులు చెప్పిన పాఠం ప్రకారం ఇక్కడి నాయకులు ఈ దేశంలో ఒక జాతి, ఒక రాష్ట్రం అంటూ లేదు.  మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా రూపొందుతున్నామని చెబుతున్నారు.  ఇంకా  కొందరు ఇక్కడ అనేక జాతులు ఉన్నాయి, ఆ  జాతుల సమూహమే ఇండియా అని, ఒక కలగూర గంప జాతుల సమూహంగా చిత్రీకరిస్తున్నారు.  వాళ్లకు ప్రమాణం ఐరోపా ఖండం లోని భాష ఆధారంగా జాతులు.  ఈ సిద్ధాంతాల రాద్ధాంతాల నుండి   దేశం ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయాస జరుగుతున్నది.   బయట పడి నప్పుడే  ఈ దేశం శక్తి వంత మౌతుంది.