సాయుధ బలగాల చట్ట పరిధి లోని ప్రాంతాల తగ్గింపు 

ఈశాన్య రాష్ట్రాల్లో ఎఎఫ్‌ఎస్‌పీఏ (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) పరిధిని కుదిస్తూ నరేంద్ర మోదీ  ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం పరిధి లోని ప్రాంతాలను కుదిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం ప్రకటించారు.
 
 ఈ చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం తీసుకొచ్చారు. అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధి లోని ప్రాంతాలను కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 
 
ఏఎఫ్‌ఎస్‌పిఎ కింద నాగాలాండ్, అసోం, మణిపూర్‌లకు పరిధి తగ్గింపు వర్తించనుంది. 23 అస్సాం జిల్లాలను పూర్తిగా, ఒకటి పాక్షికంగా ఈ చట్టం పరిధి నుంచి తొలగించింది.ఆరు మణిపూర్ జిల్లాల్లో 15 పోలీస్ స్టేషన్లను, నాగాలాండ్ లోని ఏడు జిల్లాల్లో 15 పోలీస్ స్టేషన్లను తొలగించింది.
 ఈ మూడు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి తమ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని అమిత్‌షా పేర్కొన్నారు. శాంతి కోసం, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అనే ప్రయత్నాలు చేసిందని, అనేక ఒప్పందాలు కూడా చేసుకుందని దీని కారణం గానే ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నాయని అమిత్ షా ప్రకటించారు.
గత సంవత్సరం డిసెంబర్‌లో నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామంలో ఉగ్రవాదులన్న భ్రమపడి సామాన్య పౌరులపై ఆర్మీ కాల్పులు జరపగా 14 మంది పౌరులు మరణించారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళనలు జరిపారు.