తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు

తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని బీజేపీ ఎంపీ సోయం బాబురావ్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెడ్తున్నారని ఆయన విమర్శించారు.
ఆదివారం ఉట్నూరులో బీజేపీ ఖానాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్,  మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, జిల్లా అధ్హక్షుడు పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపి సోయం బాపురావ్ మాట్లాడుతూ అబద్దాల పునాదులపై ఏర్పడిన టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అవే అబద్దాలతో పరిపాలన కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు, ఐక్యతతో కేసులను ఎదుర్కొందామని సూచించారు. ప్రజలు చైతన్యవంతమౌతున్నారని, టి.ఆర్.ఎస్ అబద్దాలను తెల్సుకుంటున్నారని స్పష్టం చేశారు. 
 
రాష్ట్రంలో రాబోయేది ఖచ్చితంగా బిజెపి ప్రభుత్వమే అని చెబుతూ టీఆర్ఎస్ అక్రమాలు, ప్రజాసమస్యల పై పోరాటాలు ఉధృతం చేద్దామని సోయం బాబురావు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ అధికారం కోసం అడ్డదారులు తొక్కే పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ది, సంక్షేమాలే బీజేపీ ధ్యేయమని చెప్పారు. 
 
 మిగతా పార్టీల అవినీతి, అక్రమాలనుండి ప్రజల్ని రక్షించి సుపరిపాలన అందించటమే బీజేపీ లక్ష్యం అని తెలిపారు.   ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఏమాత్రం విలువ ఇవ్వని వ్యక్తి కేసీఆర్ సీఎంగా ఉండటం దురదృష్ట్రకరం పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్లేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ గుత్తేదార్లకు మాత్రం అందుబాటులో ఉంటారని విమర్శించారు.