ఉత్తరాఖండ్‌ సీఎంగా పుష్కర్‌ ప్రమాణ స్వీకారం

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి బుధవారం వరుసగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.
 
 ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ గుర్మిత్‌ సింగ్‌ ధామితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాలను దక్కించుకున్న బీజేపీ.. అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే అప్పటికే ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న పుష్కర్‌ సింగ్‌ ధామి మాత్రం ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. 
 
ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ.. పుష్కర్‌కే ఉత్తరాఖండ్‌ సీఎం పగ్గాలు అప్పగించింది బీజేపీ నాయకత్వం. ఉత్తరాఖండ్‌ ఏర్పడిన గత 21 ఏళ్లలో ఒక పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.  పుష్కర్‌ సింగ్‌ ధామితో పాటు ముగ్గురు శాసన సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
చందన్‌ రామ్‌దాస్‌, సౌరభ్‌ రావత్‌, ప్రేమ్‌చంద్‌ అగర్వాల్‌ను తన కేబినెట్‌లో ధామీ అవకాశం ఇచ్చారు. పుష్కర్‌ సింగ్‌ ఓడిపోవడంతో  ఇక ఆయనకు సీఎం పదవి దక్కనట్లే అని అందరూ భావించారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం బీజేపీ గెలుపు కోసం ధామీ చేసిన కృషిని గుర్తించింది. ఓడినా కూడా ఆయనకే ఉత్తరాఖండ్‌ పగ్గాలు అందించింది. 
 
అయితే ధామీని తప్పిస్తే.. సీఎం రేసులో మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, మాజీ కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌, సీనియర్‌ నేత సత్పాల్‌ మహారాజ్‌తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. పుష్కర్‌ సింగ్‌ ధామీకే సీఎం పీఠం కేటాయిస్తే.. బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.